
పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా అంబేద్కర్ భవన్కు కవిత.. బాధితులతో కలిసి మళ్లీ దీక్ష
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం రాత్రి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.
బాధితుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమె చేపట్టిన ఈ ఆందోళనతో ఖమ్మం నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అంతకుముందు సోమవారం ఉదయం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన కవిత, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం బాధితులతో కలిసి నగరంలోని జడ్పీ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ దీక్షలో ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ మరియు ఇతర మద్దతుదారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసుల జోక్యం – నోటీసులు . నిరసన ఉధృతం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ముందస్తు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు కవితను, విశారదన్ మహారాజ్ సహా ఇతర ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులకు, తెలంగాణ జాగృతి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి, సెక్షన్ 41 CrPC కింద నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. పోలీసుల విడుదల అనంతరం కవిత వెనక్కి తగ్గలేదు.
రాత్రి 9 గంటల సమయంలో నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. అక్కడ వెలుగుమట్ల నిర్వాసితులతో కలిసి ఆమె నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. పేద ప్రజల ఇళ్లను కూల్చివేసి వారిని రోడ్డున పడేయడం అన్యాయం.
బాధితులకు ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయం చూపించి, న్యాయం చేసే వరకు ఈ దీక్ష కొనసాగుతుంది అని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం అంబేద్కర్ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాధితులకు మద్దతుగా వస్తున్న వారిని అడ్డుకుంటుండటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.



