
ఇద్దరు పిల్లల మధ్య గొడవ.. బాలుడిని చితకబాదిన టీచర్..
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్లో ఇద్దరు పిల్లల మధ్య గొడవ కారణంగా ఓ బాలుడిని చితకబాదింది ఓ టీచర్. మంగళవారం ( మార్చి 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న సాత్విక్ అనే బాలుడిని చితకబాదింది లేడీ టీచర్.
స్కూల్లో ఇద్దరు పిల్లలతో సాత్విక్ గొడవపడ్డాడన్న కారణంతో దారుణంగా చితకబాదింది టీచర్. అయితే.. తమ పిల్లాడినే ఇద్దరు పిల్లలు బూతులు తిట్టారని.. వాళ్ళను మందలించాల్సింది పోయి… టీచర్ సాత్విక్ ను చితకబాదిందని ఆరోపిస్తోంది తల్లి సంజన.
మధ్యాహ్నం లంచ్ సమయంలో స్కూల్ ప్రిన్సిపాల్ ను కలిసిన సాత్విక్ తల్లి.. తమ పిల్లాడిని ఇద్దరు బూతులు తిడుతున్నారంటూ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పిల్లల గొడవ విషయం విచారించాలని సోషల్ టీచర్ కు సూచించారు ప్రిన్సిపాల్.
ప్రిన్సిపాల్ సూచనతో విషయాన్ని విచారించిన సోషల్ టీచర్ కు సాత్విక్ తమను బూతులు తిడుతున్నారని ఇద్దరు పిల్లలు చెప్పడంతో ఆవేశంతో సాత్విక్ ను చితకబాదింది సోషల్ టీచర్.
టీచర్ చితకబాడంతో తీవ్ర గాయాలైన సాత్విక్ ను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తమ పిల్లాడిని బూతులు తిడుతున్నారంటూ ఫిర్యాదు చేస్తే… తమ పిల్లాడినే కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సాత్విక్ పేరెంట్స్.
పిల్లలు తప్పు చేస్తే మందలించి… పేరెంట్స్ ను పిలిపించి పనిష్మెంట్ ఇవ్వాలి కానీ.. ఇలా విచక్షణారహితంగా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తోంది సాత్విక్ తల్లి.



