
సర్పంచ్ వర్సెస్ పోలీస్.. మధ్యలో బీఆర్ఎస్
Web desc : భద్రాద్రిలో ఇసుక వివాదం తారాస్థాయికి చేరింది. “సర్పంచ్ అయితే నాకేంటి..?” అంటూ పట్టణ సీఐ నాగరాజు తనతో దురుసుగా మాట్లాడారని సర్పంచ్ పూనెం కృష్ణదొర సీఐ పై ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతోనే ఇసుక వ్యాపారం నడుస్తుందని బీఆర్ఎస్ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ విమర్శించారు.
పేదోడు ఇల్లు కట్టుకుందామంటే దొరకని ఇసుక, అభివృద్ధి పనులకు ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల పేరుతో ఇసుక బ్లాక్ మార్కెట్కు తరలిపోతుందని ఆరోపించారు.
అసలేం జరిగిందంటే…
పట్టణంలో ఏ ప్రభుత్వ శాఖ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా తహసీల్దార్ అనుమతి తీసుకుని ఇసుక తరలించాల్సి ఉంటుంది. ఇదే విధంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులకు ఇసుక అవసరం కావడంతో గ్రామ పంచాయతీ అధికారులు తహసీల్దార్ అనుమతి తీసుకుని ఇసుకను తరలిస్తున్నారు.
అయితే మంగళవారం పోలీసులు ఇసుక ట్రాక్టర్లను ఆపారు. దీంతో ఇసుకను పంచాయతీ అభివృద్ధి పనులకు తరలిస్తున్నామని, తమ వద్ద అనుమతులు ఉన్నాయని సర్పంచ్ సీఐకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కానీ సీఐ పట్టించుకోకుండా “సర్పంచ్ అయితే ఏంటి..?” అనే ధోరణిలో, ఒక ఆదివాసి ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా దురుసుగా మాట్లాడారని సర్పంచ్ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం పై బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ, కాంగ్రెస్ నాయకులు ఇసుక వ్యాపారం చేస్తున్నారని, పేద ప్రజలకు ఇసుక అందకుండా చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. దీంతో భద్రాద్రిలో ఇసుక వివాదం రాజకీయ దుమారం రేపుతోంది.




