
అక్కినాపురం తండలో కంకర మిల్లు దగ్ధం
– విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతి
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 12 2026: ఏన్కూరు మండల పరిధిలోని అక్కినాపురం తండ గ్రామం సమీపంలో ఉన్న కంకర మిల్లు గురువారం సాయంత్రం అగ్నికి ఆహుతైంది.
గుర్తుతెలియని వ్యక్తులు కొండ ప్రాంతంలో నిప్పంటించడంతో ఆ మంటలు వేగంగా వ్యాపించి సమీపంలో ఉన్న కంకర మిల్లుకు చేరుకున్నాయి. గాలికి తోడు మంటలు తీవ్రంగా రగులుకోవడంతో కొద్ది సేపట్లోనే మిల్లులోని వివిధ యంత్రాలు మరియు సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి.
మిల్లులో ఉన్న క్రషర్ యంత్రం, కన్వేయర్ బెల్ట్, జనరేటర్, ఎలక్ట్రికల్ వైరింగ్, మోటార్లు, డీజిల్ డ్రములు, రబ్బరు బెల్టులు, ఇనుప పరికరాలు వంటి విలువైన సామాగ్రి మంటల్లో దగ్ధమైనట్లు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా మిల్లుకు భారీ ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మంటలు రగులుతున్నట్లు గమనించిన గ్రామస్థులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక మండల ఎస్సై సంధ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కొండ ప్రాంతంలో నిప్పంటించిన వారెవరు అనే దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో అక్కినాపురం తండ గ్రామంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.




