
ఎక్సైజ్ సీఐ భర్త ఆత్మ*హత్య….
వేధింపుల వల్లే అంటూ.. సూసైడ్ నోట్
ఎక్సైజ్ సీఐ జ్యోతి భర్త శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని నేరేడ్మెట్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పరిధిలోని నేరేడ్మెట్ లక్ష్మీనగర్లో నివసించే నగెల్లి శ్రీనివాస్ (41) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
అతని స్వగ్రామం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్.. శ్రీనివాస్ 2012లో సట్లపల్లి జ్యోతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
భార్య గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి శ్రీనివాస్ ప్రోత్సాహం అందించాడు. తర్వాత జ్యోతి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఎక్సైజ్ సీఐగా నియమితులయ్యింది.
అయితే.. జ్యోతికి ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తను దూరం పెట్టడమే కాకుండా, శ్రీనివాస్ కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు, విడాకుల కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం. దీంతో గత నాలుగు నెలలుగా శ్రీనివాస్ భార్యకు దూరంగా ఉంటున్నాడు.
కోర్టు కేసులు, భార్య వేధింపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ‘భార్య వేధింపులు, కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీనివాస్ సోదరుడు శివకృష్ణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. సోదరుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ భార్య జ్యోతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




