
ఎమ్మార్వోపై అరెస్ట్ వారెంట్ జారీ.. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు
Web desc నల్గొండ జిల్లాకు చెందిన ఓ తహసీల్దార్పై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) అరెస్ట్ వారెంట్ జారీ చేయడం.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తహసీల్దార్ విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా.. రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేయడంతో హెచ్ఆర్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మార్వోపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చింది. భూ వివాదానికి సంబంధించిన కేసులో ఎమ్మార్వో అనిల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని కమిషన్ తేల్చింది.
తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని భూ వివాదంలో ఎమ్మార్వో అనిల్ అత్యుత్సాహం ప్రదర్శించినట్లు గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా.. ఏకపక్షంగా బాధితుడికి అన్యాం జరిగేలా తహసీల్దార్ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఎమ్మార్వో చేసిన పనికి తనకు అన్యాయం జరిగిందని భావించిన బాధితుడు.. తనకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు.
బాధితుడి ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న హెచ్ఆర్సీ.. ఈ భూ వివాదంపై సమగ్రంగా విచారణ జరిపి పూర్తి స్థాయి రిపోర్టును తమకు సమర్పించాలని ఎమ్మార్వో అనిల్కు హెచ్ఆర్సీ గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. అయితే కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని ఎమ్మార్వో అనిల్..
గడువు ముగిసినప్పటికీ హెచ్ఆర్సీకి రిపోర్టు సమర్పించలేదు. ఇలాగే కాలయాపన చేస్తుండడాన్ని తీవ్రంగా పరిగణించిన హెచ్ఆర్సీ.. ఒక బాధ్యత గల ప్రభుత్వ అధికారి అయి ఉండి.. కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలనే తహసీల్దార్ అనిల్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన హెచ్ఆర్సీ.. వెంటనే అతడిని అరెస్ట్ చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అయితే విధుల్లో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై సంబంధిత అధికారుల నుంచి హెచ్ఆర్సీ వివరణ కోరడం, ఆ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించడం సర్వ సాధారణమే అయినప్పటికీ..
ఈ ఘటనలో మాత్రం ఒక ఎమ్మార్వోను అరెస్ట్ చేయాలంటూ వారెంట్ జారీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. విధుల్లో బాధ్యతారాహిత్యంగా పనిచేసే ప్రభుత్వ అధికారులకు ఈ సంఘటన ఒక హెచ్చరిక అని ప్రజలు పేర్కొంటున్నారు.



