
తండ్రి మరణాన్ని దిగమింగి.. పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి..
హృదయ విదారకరమైన సంఘటన ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బత్తులపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గండేపల్లి మణికంఠ అనే విద్యార్థి శనివారం తన వార్షిక పరీక్షలు రాయాల్సి ఉంది.
శుక్రవారం తెల్లవారుజామున తన తండ్రి గండేపల్లి కొండలరావు అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. పితృ వియోగాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్ష హాజరు కావడం తోటి విద్యార్థులు, గ్రామస్థుల హృదయాలను కలచివేసింది.
కొండలరావు డిగ్రీ వరకు చదివి ఉన్నత చదువులు చదివే స్తొమత లేకపోవడంతో గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులకు వెళుతూ భార్య పిల్లలను పోషిస్తున్నాడు. ఇటీవల కామెర్ల వ్యాధి రావడంతో కొండలరావు మంచానికే పరిమితం అయ్యాడు.
దీంతో కుటుంబ భారం కొండలరావు భార్య శ్రీలక్ష్మి మీద పడింది. వైద్యం చేయించుకునే స్తోమత లేక వ్యాధి ముదరడంతో ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు.
కుటుంబ పెద్ద మరణించడంతో ఆ కుటుంబ పరిస్థితి దిక్కు తోచకుండా ఉంది. తనకు ఉన్నత చదువులు చదవాలని ఉందని.. దాతల సాయం కోసం ఆర్జిస్తున్నాడు. కొండలరావు మరణం బత్తుల పల్లి గ్రామంలో తీవ్ర విషాదం మిగిల్చింది.



