
కామారెడ్డి మున్సిపల్ లో ఏసీబీ సోదాలు…
Web desc : కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండడంతో మున్సిపల్ అధికారుల్లో భయాందోళన మొదలైంది.
ఏసీబీ అధికారుల తనిఖీల్లో ఎవరి బండారం బయటపడుతుందోనని పలు శాఖల అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా కామారెడ్డి మున్సిపాలిటీలో పలుమార్లు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కొంతమంది అధికారులు డబ్బులు తీసుకోకుండా ఎలాంటి పనులు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి.
ఈ విషయమై ఏసీబీ అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. దాంతో ఏసీబీ అధికారులు కార్యాలయంలోని అన్ని శాఖలకు సంబంధించిన రికార్డులు తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాల నేపథ్యంలో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రికార్డుల తనిఖీల్లో ఎలాంటి విషయాలు భయటపడతాయోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. అటు రాజకీయ నాయకులు సైతం ఆందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది.
కార్యాలయంలో ఏం జరుగుతోందని పలువురికి ఫోన్లు చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఏసీబీ అధికారుల సోదాలు ఇటు అధికారులతో పాటు అవినీతి నీ ప్రోత్సహించే రాజకీయ నాయకుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.


