
భూదాన భూములు 150 ఎకరాలు మాయం — మహబూబాబాద్ లో భూ కామాంధుల ఘోరం……!!
భూదాన్ భూములను కాపాడాలి — భూమిలేని పేదలకు పంచాలి….!!
ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్ డిమాండ్
ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతుంటే రెవెన్యూ అధికారులు నిద్రపోతున్నారా…..??
పేదలు భూదాన భూముల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చేస్తారు — కానీ బడా బాబులు కబ్జా చేస్తే నిద్రపోతున్నారా…..??
ఈ భూదాన భూములు పై ఖమ్మం లాగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం కానున్న ఎల్ హెచ్ పి ఎస్ — ప్రజా సంఘాలతో చర్చలు జరిపి త్వరలో నిర్ణయం……!!
భూమిలేని పేదలకు నా 150 ఎకరాల భూమిని రాసి ఇస్తున్నాను అని, ఆనాడు శ్రీ జన్నారెడ్డి రగోత్తం రెడ్డి గారు ప్రభుత్వానికి 18/09/1952 లో భూదాన బోర్డుకు రాసి ఇవ్వడం జరిగింది, వారి గొప్ప మనసుకు కోటి దండాలు…
కానీ మల్యాల గ్రామంలో భూదాన భూములు అక్రమంగా కబ్జా చేయబడిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని సర్వే నంబర్లు 382, 393, 394, 395, 271, 277, 278, 273, 274, 275, 396, 398, 104, 279, 359, 358, 67, 167, 200, 202 కు చెందిన దాదాపు 150 ఎకరాల భూదాన భూమి అక్రమంగా మాయం కావడం ఎంతో దురదృష్టకరం. పేదల కోసం, భూమిలేని కుటుంబాల కోసం ఇవ్వబడిన ఈ భూములు కొందరి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కబ్జా చేయబడటం ప్రజాస్వామ్యానికి మచ్చగా నిలుస్తోంది.
భూదాన ఉద్యమం ద్వారా పేదలకు పంపిణీ చేయాలని ఉద్దేశించిన ఈ భూములు అక్రమంగా కొందరి చేతుల్లోకి వెళ్లిపోవడం వెనుక ఉన్న వారిపై ప్రభుత్వం తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.
భూములను కాజేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, ఆ భూములను వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని భూమిలేని పేదలకు న్యాయంగా పంపిణీ చేయాలి.
ప్రభుత్వ భూములను కొందరు దర్జాగా ఆక్రమించుకుంటూ ఉంటే, వాటిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్న ప్రజల్లో తీవ్రంగా ఉత్పన్నమవుతోంది.
అధికారులు తమ బాధ్యతను నిర్వర్తించకపోవడం వెనుక ఏదైనా నిర్లక్ష్యమా? లేక ఇంకేదైనా కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములు అన్నిక్రాంతం అవుతుంటే వాటిని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం నిజంగా చాలా సిగ్గుచేటు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి భూదాన భూములపై జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే, లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్ ఆధ్వర్యంలో తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా దిగుతామని స్పష్టం చేస్తున్నాం.
పేదల హక్కులను కాపాడటం ప్రభుత్వపు మొదటి బాధ్యత. భూదాన భూములను కాజేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని, ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేస్తున్నాం.
అలా జరగకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం…..




