
‘అలా చేస్తేనే ఇంటి నెంబర్ ఆన్లైన్ చేస్తామంటున్నారు’.. గ్రీవెన్స్లో మహిళ తీవ్ర ఆవేదన
మహబూబాబాద్: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాను కూడా పట్టించుకోకుండా లంచం ఇస్తేనే పనవుతుందని మున్సిపాలిటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
పట్టణంలోని దాసరి వెంకటేశ్వర్లు బాబా గుట్ట కాలనీకి చెందిన ఓ మహిళ ఇంటి నెంబర్ ఆన్లైన్ చేయించుకునేందుకు నాలుగు సంవత్సరాలుగా మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాబా గుట్ట కాలనికి చెందిన బోలెదుల్ల వాణికి గత ప్రభుత్వ హయాంలో G.O. నెం: 58 కింద అస్సైన్మెంట్ పట్టా మంజూరైంది.
ఆమె నివసిస్తున్న ఇంటికి గతంలో ఇంటి నెం:6-1-121/34 కేటాయించబడినట్లు తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఇంటి నెంబర్ ఆన్లైన్ రికార్డుల నుంచి తొలగించబడినట్లు బాధితురాలు పేర్కొన్నారు.
దీంతో G.O.58 పట్టా ఆధారంగా మళ్లీ ఇంటి నెంబర్ ఆన్లైన్ చేయాలని కోరుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లిన ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆమె తెలిపారు.
ఈ క్రమంలో మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ.25,000 లంచం ఇస్తేనే ఇంటి నెంబర్ ఆన్లైన్ చేస్తామని, లేదంటే పని జరగదని చెప్పారని బాధితురాలు ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన G.O. 58 పట్టాను కూడా నకిలీ పత్రం అంటూ మాట్లాడారని ఆమె వాపోయారు.
తాము కూలి పని చేసుకుని జీవించే పేద కుటుంబం కావడంతో అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వలేమని వాణి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉన్నప్పటికీ ఇంటి నెంబర్ ఇవ్వకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ను వివరణ కోరగా.. ఈ వ్యవహారంలో ఆరోపిస్తున్న బాధితులు తనను కలవలేదని ఒక వేళ కలిసి ఉంటే నిజా నిజాలు తెలిసేవని మున్సిపాలిటీ ఉద్యోగులు ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




