
స్కూల్లో మంత్రి ఆకస్మిక తనిఖీ.. హెడ్ మాస్టర్ సస్పెండ్
Social media viral : ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మైలవరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్కూల్లో మద్యాహ్నం విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపణలు రావడంతో..స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. తారక రామానగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆ సమయంలో అక్కడ భోజనం చేస్తున్న విద్యార్థులను మంత్రి ఆరా తీశారు. రోజూ స్కూల్లో పెట్టో భోజనం బాగుండటం లేదా..? ఆ ఒక్కరోజే బాగోలేదా ? అని అడగ్గా.. రోజూ భోజనం బాగుంటుందని స్టూడెంట్స్ బదులిచ్చారు.
అనంతరం స్టూడెంట్స్ తో కలిసి లోకేష్ భోజనం చేశారు. ఆపై సమీపంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి, చిన్నపిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా తనతో తీసుకొచ్చిన నివేదికపై లోకేష్ ఎంఈఓతో చర్చించారు.
ఇటీవల స్కూల్ హెడ్ మాస్టర్ జాన్.. పాఠశాలలో పిల్లలకు మద్యాహ్నం పెట్టే భోజనం బాగుండటం లేదని ఆరోపించారు. భోజనం అధ్వాన్నంగా ఉందని విద్యార్థులు చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంత్రి లోకేష్ ఈ సడెన్ ఇన్ స్పెక్షన్ నిర్వహించారు.
దీనిపై స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కు కూడా ముందస్తు సమాచారం లేదని తెలుస్తోంది. మంత్రి తనిఖీలు, విద్యార్థుల సమాధానాలతో హెచ్ఎం జాన్ కుట్రపూరితంగా పిల్లలతో డ్రామా ఆడించి, మద్యాహ్న భోజనంపై దుష్ర్పచారం చేయించినట్లు తేలడంతో అతడిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఏపీఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం. కాగా.. మంగళవారం ఉదయం మంత్రి నారా లోకేష్.. మంగళగిరి నియోజకవర్గంలోని మయూరి టెక్ పార్క్ భవనంలో ఏర్పాటు చేసిన ఏపీఈడీబీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి వచ్చిన వందరూపాయల పెట్టుబడుల్లో 25 రూపాయలు ఏపీకి వచ్చాయని లోకేష్ తెలిపారు.
ఒప్పందాలతో పాటు పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషిచేయాలని మంత్రి సూచించారు. ఈనెల 23న రెండో స్టీల్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే సింగిల్ అజెండాగా ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఏపీని ఎంచుకున్నాయని, రాష్ట్ర అభివృద్ధిలో వేగం మరింత పెరగాలని లోకేష్ తెలిపారు.




