
హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ వీరంగం..
Web desc : హైదరాబాద్లోని అత్తాపూర్ పరిధిలో గంజాయి ముఠా ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. కేవలం తమ ఇంటి ముందు గంజాయి తాగవద్దని మందలించినందుకు ఆ ముఠా సభ్యులు రెచ్చిపోయి స్థానికులపై దాడికి దిగారు.
మత్తులో ఉన్న వారు విచక్షణ కోల్పోయి ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేయగా.. ఆ దాడి తీవ్రతకు కత్తి పిడి విరిగిపోయి, బ్లేడ్ భాగం సదరు వ్యక్తి వీపులోనే దిగబడిపోయింది.
అంతటితో ఆగకుండా.. ఈ గంజాయి బ్యాచ్ స్థానికుల ఇళ్ల తలుపులపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. అయితే, స్థానికులు ఐక్యంగా వారిని అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ క్రమంలో నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ఘటన అత్తాపూర్ ప్రాంతంలో కలకలం రేపింది.



