
తగ్గేదేలే అంటున్న ఈటల.. బీజేపీలో సెగలు పుట్టిస్తున్న రాజేందర్ లేటెస్ట్ వార్నింగ్
ఈటల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు బీజేపీని షేక్ చేస్తున్నాయంట. ఈటల విసురుతున్న ఈటెలు హెచ్చరికలా? తిరుగుబాటుకు ట్రైలరా..? అన్న చర్చ మొదలైంది.అసలు భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ ఎవరికీ మెసేజ్ ఇస్తున్నారు..? ఎవరికి వార్నింగ్ లిస్తున్నారు..?..
బీజేపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఆయనవి మాటలేనా..? లేక ఫ్యూచర్ యాక్షన్కు సిగ్నల్ ఇస్తున్నారా..? పదేపదే ఈటల డిగ్నిటీ, ధర్మం, న్యాయం, పదవులు వంటి అంశాలు పార్టీలో ఎందుకు లేవనెత్తుతున్నట్టు..? బీజేపీ నుంచి ఈటల సైడ్ అవ్వాలనుకుంటున్నారా.? సైడ్ చేస్తున్నారా..? ఇప్పుడు ఇదే పంచాయితీ రాష్ట్ర పార్టీలో మంటలు రేపుతోందంట
సమయం వచ్చినప్పుడు కౌంటర్ ఇస్తా. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు ఈ నెల 20న జరిగాయి. సాధారణంగా ఎవరి పుట్టినరోజు కార్యక్రమాలైనా అయినా శుభాకాంక్షలతో ముగుస్తాయి.
ఈసారి అందుకు భిన్నంగా ఈటల రాజేందర్ తన జన్మదిన సెలబ్రేషన్స్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం సొంత పార్టీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయట. తన బర్త్డే వేడుకల్లో ఈటల భావోద్వేగానికి గురయ్యారు.
పార్టీలో తన గురించి ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసని, అయినా తాను రియాక్ట్ అవ్వడం లేదన్నారు. అన్నిటికీ తగిన సమయంలో కౌంటర్ ఇస్తానన్న ఆయన, డబ్బులతో వార్తలు కొనొచ్చు, పదవుల కోసం మౌనం వహించడం లేదని, తమతో పెట్టుకుంటే ధర్మంతో పెట్టుకున్నట్టే అని పంచ్ డైలాగులు విసిరారు.
సొంత పార్టీకే షాక్ ఇచ్చిన ఈటల రాజేందర్. గత కొంతకాలంగా బీజేపీలో కొంత అసహనంతో కనిపిస్తున్న ఈటల రాజేందర్.. బీఆర్ఎస్ నేతలతో టచ్లోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది.
ఈ నేపధ్యంలో ఈటల ధర్మానిదే ఎప్పటికైనా విజయమని, డబ్బులిచ్చి రాయించుకునే వార్తలను ఎవరు నమ్మరని .. సొంత పార్టీ వారినే టార్గెట్ చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ క్రమంలో నిజంగా సొంత పార్టీపై ఈటల అంత అసంతృప్తితో ఉన్నారా?.. ఇక చాలులే అనుకుని భవిష్యత్ రాజకీయ వ్యూహానికి సిద్దమవుతున్నారా? అన్నది కాషాయ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతూ.. అంతర్గతంగా పెద్ద దుమారానికి దారి తీస్తున్నాయంట.
ఈటల రాజేందర్ కామెంట్స్ వైరల్ . ఈటల పరోక్షంగా ఎవరిని టార్గెట్ చేశారు. పార్టీలో డబ్బులిచ్చి వార్తలు రాయించుకుంటున్నది ఎవరు..? పార్టీలో ఎదగకుండా సీనియర్ పొలిటీషియన్ అయిన ఈటల రాజేందర్ ను అడ్డుకుంటున్నదెవరు..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఆ అడ్డుకుంటుంది కేంద్ర మంత్రి బండి సంజయ్యే అన్న ప్రచారం ఉంది. ఏదైనప్పటికీ ఉద్యమ బిడ్డ ఇట్లాంటి మాటలు మాట్లాడటం, పదేపదే వార్తలకెక్కుతుండటంతో బీజేపీ పార్టీ అంతర్గత వ్యవస్థపై ఆయనకు నమ్మకం తగ్గిందనే సంకేతాలు వెలువరుస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈటల వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత భావోద్వేగంతోనే కాదని, పార్టీ ఇన్సైడ్ పరిణామాలపై ఒక క్లియర్ మెసేజ్గా కనిపిస్తున్నాయన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈటల రాజేందర్ భవిష్యత్పై ఉత్కంఠ. ఈటలది తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనా? లేక ఆ పార్టీలో పెద్ద రాజకీయ మార్పులకు నాంది కాబోతుందా? అన్న సందేహాలు బీజేపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయంట. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడిగా ఈటల రాజేందర్కు మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది.
రక్తం చిందించి తెలంగాణను సాధించుకున్నామని, ఎన్నో అవమానాలకు గురయ్యామని, ఎన్నో అవాంతరాలను ఎదురుకున్నామని, తన రాజకీయ ప్రయాణంపై ఈటల పదేపదే మాట్లాడుతుంటారు.
అది వాస్తవమే అని తెలిసినా రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఆయన పార్టీలో ఎదిగితే తమకు ఎసరు వస్తుందన్న భయంతో, ఎప్పటికప్పుడు ఆయనకు కీలక పదవులు దక్కకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆయనకు సరైన స్థానం కల్పించకపోవడం దురదృష్టకరమన్న చర్చ పార్టీతో పాటు ఈటల వర్గాల్లో నడుస్తోంది.
రాజాసింగ్ బాటలోనేనా? అంతేకాదు ఇట్లాంటి కుట్ర వ్యవహారాల వల్లే ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు గతంలో కీలక నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పారన్న చర్చ సైతం జరుగుతోంది.
ఈటల కూడా ప్రస్తుతం అదే దారిలో నడుస్తున్నారన్న టాక్ ఉంది. అందుకే డిగ్నిటీ, ధర్మం, పదవులు, వెన్నుపోట్లు, ప్రలోభాలకు తలొగ్గం అంటూ పార్టీపై, పార్టీ లైన్ పై ఇన్డైరెక్ట్ కౌంటర్లు ఎక్కుపెట్టారంటున్నారు.
ఈటల రాజేందర్ నెక్స్ట్ మూవ్ ఏంటి? తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో ఈటల స్టెప్ వచ్చే రోజుల్లో కీలకంగా మారే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. బీజేపీకి ఎన్నికల ముందు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయ శాంతి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వంటి సీనియర్లు మూకుమ్మడిగా గుడ్ బై చెప్పారు.
ఇప్పటికే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పాటిల్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ వంటి నేతలు తమ భవిష్యత్ రాజకీయానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతుంది. అన్ని కుదిరితే కాంగ్రెస్ కు జై కొడతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈటల రాజేందర్ మాత్రం సొంతంగా అడుగులు వేస్తారన్న టాక్ ఆయన వర్గాల్లో వినిపిస్తుంది. మరి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల లెక్కలు ఏ విధంగా ఉంటాయి? ఈ పరిణామాలు ఎటు మలుపుతిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.




