
సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ళ కూతుర్ని చంపేసిన తండ్రి..
యాదాద్రి భువనగిరి జిల్లాలో సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన చోటు చేసుకుంది. అది రక్త సంబంధానికి అర్థం లేకుండా చేసింది. వైవాహిక కలహాలతో ఒక తండ్రి తన రెండేళ్ల కుమార్తె మేఘనకు విషం కలిపిన సపోటా పండు తినిపించి ప్రాణాలు తీసిన ఘటన ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేస్తుంది. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
చిన్నారి పాలిట మరణశాసనం రాసిన తండ్రి. రెండేళ్ల అమాయకపు బిడ్డ ఎంతో ప్రేమతో తన తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి ఇచ్చిన పండులో విషం ఉందని తెలియక దానిని ఇష్టంగా తినేసింది.
ఆ పండులో తండ్రి విషం పెట్టాడని తెలియని చిన్నారి ప్రాణం విలవిలలాడి అనంత వాయువుల్లో కలిసిపోయింది. కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రి ఆ చిన్నారి పాలిట మరణ శాసనం రాసిన ఘటన స్థానికంగా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.
భార్యాభర్తల గొడవ.. భర్తను వదిలి వెళ్ళిన భార్య. పోలీసుల, స్థానికుల వివరాల ప్రకారం.. సంస్థాన్నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంకు చెందిన వరికుప్పల రవికి మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మాడ్గుల స్వాతితో వివాహమైంది.
వీరికి రెండేళ్ల మేఘన, తొమ్మిది నెలల మయూరి సంతానం. పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా, దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త తీరుతో విసిగిపోయిన స్వాతి చిన్న కూతురు మయూరి ని తీసుకొని మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్ళింది.
బిడ్డను ఇవ్వకపోవటంతో భర్తపై భార్య ఫిర్యాదు. మేఘన మాత్రం రవి వద్ద ఉంటోంది. తన పెద్ద కూతురుని కూడా తన వద్దకు పంపించాలని స్వాతి పదేపదే రవిని అడుగుతోంది.
పెద్దల ద్వారా మాట్లాడడానికి ప్రయత్నించినా రవి నిరాకరిస్తూ వస్తుండడంతో స్వాతి మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ లో రవి పైన ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులు నారాయణపురం పోలీసులకు సమాచారం ఇవ్వగా, స్థానిక పోలీసులు రవిని పిలిపించి మాట్లాడారు.
సపోటా పండులో ఎలుకల మందు కలిపి పెట్టిన తండ్రి. పెద్ద మనుషుల సమక్షంలో మార్చి 23వ తేదీ పంచాయితీ జరగాల్సి ఉండగా, అంతకన్నా ముందే రవి తన కుమార్తెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో సపోటా పండులో ఎలుకల మందు కలిపి మేఘనకు పెట్టాడు. పండు తిన్న కొద్దిసేపటికే మేఘనకు వాంతులు కాగా, అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న రవి నిద్ర మాత్రలు ఎలుకల మందు తీసుకున్నాడు.
పాప మృతి, ఆస్పత్రిలో తండ్రి. దీంతో కుటుంబ సభ్యులు వారిద్దరిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆపై అక్కడ నుంచి హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మేఘన సోమవారం మృతిచెందగా స్వాతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా రవి నుండి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.
పాప ప్రాణం తీసిన ఆలుమగల పంచాయితీ. భార్యాభర్తల మధ్య గొడవ అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలకు హత్యలు, ఆత్మహత్యలు పరిష్కారాలు కాదని, సంయమనంతో సమస్యలను పరిష్కరించుకోవాలని పలువురు చెబుతున్నారు.




