
శ్రీరామనవమి వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం.. తుంగభద్ర నదిలో నలుగురు మృతి
శ్రీరామనవమి వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది.
తుంగభద్ర నదిలో స్నానాలకు దిగి నలుగురు మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రం కుల్దీ గ్రామానికి చెందిన 15 మంది కర్నూలు జిల్లా కందుకూరుకు వచ్చారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వారంతా గ్రామానికి చేరుకున్నారు.
పెళ్లి అనంతరం సరదాగా గడిపేందుకు కోసిగి మండలం ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు వారంతా వెళ్లారు. స్నానం చేసేందుకు 15 మందీ తుంగభద్ర నదిలోకి దిగారు. అయితే, లోతు ఎక్కువగా ఉండడం, ఈత రాకపోవడంతో పలువురు నదిలో కొట్టుకుపోయారు.
అదృష్టవశాత్తూ కొంతమంది ప్రాణాలు రక్షించుకోగా.. ఈత రాక మునిగిపోయి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారిని ఉమావతి, రత్నమ్మ, మాంతేశ్, శివానంద్గా పోలీసులు గుర్తించారు.



