
అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి బిహేవియర్ బాగోలేదు: బండి సంజయ్ సీరియస్
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని అన్నారు. చట్ట సభల్లో సభ్యులు గౌరవంగా నడుచుకోవాలని హితవు పలికారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం మంచి పద్దతి కాదని చెప్పారు.
రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీ లేదు.. ఎథిక్స్ కమిటీ లేదు.. లేని కమిటీకి కౌశిక్ రెడ్డి అంశాన్ని రికమండ్ చేయడం ఏంటని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్లకు బీజేపీ ఎప్పుడూ దూరమే.. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే అని బండి సంజయ్ విమర్శించారు. ఫార్ములా ఈ-రేసు కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పటివరకు కేటీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు.
రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కారణంగానే చర్యలు తీసుకోవడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ – బీజేపీ పొత్తు ఎప్పటికీ జరుగదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్లకు బీజేపీ ఎప్పుడూ దూరమే అని వెల్లడించారు. దాంతో పాటు వారసత్వ, కుటుంబ రాజకీయాలకు కూడా బీజేపీ దూరమే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డిప్రెషన్లో ఉండి డీలిమిటేషన్పై మాట్లాడుతున్నారని విమర్శించారు.




