
విద్యార్థినికి లెక్చరర్ల వేధింపులు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Web desc : మేడ్చల్ జిల్లా ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. తనపై లెక్చరర్లు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తల్లితో కలిసి విద్యార్థిని తిరునాయన ఫిర్యాదు చేశారు. కాప్రాకు చెందిన తిరునాయన ప్రస్తుతం బీఎస్సీ డేటా సైన్స్ మూడవ సంవత్సరం చదువుతోంది.
అనారోగ్య సమస్యల కారణంగా తరచూ కళాశాలకు హాజరు కాలేకపోయిన ఆమె, డాక్టర్ సర్టిఫికెట్ సమర్పించి అటెండెన్స్ ఫీజు చెల్లిస్తూ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపింది. మొదటి సంవత్సరం నుంచే కళాశాల లెక్చరర్లు తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

రెండవ సంవత్సరం సమయంలో తన వ్యక్తిత్వంపై తప్పుగా ప్రచారం చేయడం, ఫోన్లోని ఫోటోలను షేర్ చేస్తూ వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురిచేశారని పేర్కొంది. ఈ వేధింపులపై గతంలో ఫిర్యాదు చేసినా, ఇప్పుడు మళ్లీ వేధిస్తున్నట్లు వెల్లడించింది.
ఇటీవల మరోసారి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో లెక్చరర్లు మానసిక ఒత్తిడికి గురిచేశారని వెల్లడించింది. కాలేజీకి రాకుండా ఎవరితో తిరుగుతున్నావని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేసింది.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. అటు బాధితురాలి తల్లి మాట్లాడుతూ, తన కుమార్తెను ఇబ్బందులకు గురిచేసిన కళాశాల లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.



