
కానిస్టేబుళ్లపై కర్రలు, రాళ్లతో దాడి…
మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున కలకలం రేపే ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఇద్దరు వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
వివరాలు ఇలా ఉన్నాయి.. మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో క్యాట్ వింగ్ కానిస్టేబుళ్లు కృష్ణ ప్రసాద్, వివేక్ గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించిన పోలీసులు, వారిని ఆపి ప్రశ్నించారు.
పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి, సదరు వ్యక్తులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ అలీ ఖాద్రిగా గుర్తించిన ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్న కర్రలు, రాళ్లతో కానిస్టేబుళ్లపై దాడికి దిగారు.
దుండగులు ఆకస్మాత్తుగా దాడి చేసినప్పటికీ, కానిస్టేబుళ్లు అప్రమత్తంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకుని మెహదీపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాగా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనే నడిరోడ్డుపై దాడి జరగడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



