
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి CID నోటీసులు.. స్పందించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చారు.. సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు, ట్రాఫిక్కు కౌశిక్ రెడ్డి అంతరాయం కలిగించారు.. పోలీసుల పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు సీఐడీ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఏప్రిల్ 4న ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని సీఐడీ ఆదేశించింది. ఇక ఈ నోటీసులపై కౌశిక్ రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సీఐడీ నోటీసులు జారీ చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాననే కారణంతో తన కుటుంబ సభ్యులను, అలాగే పార్టీకి చెందిన ఇతర కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా తనపై చర్యలు తీసుకోవచ్చని, కేసులు పెట్టవచ్చని, నోటీసులు ఇవ్వవచ్చని కానీ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అన్యాయమని స్పష్టం చేశారు.
తనను నేరుగా లక్ష్యంగా చేసుకోవాలని, కానీ కుటుంబ సభ్యులను వేధించడం మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అయినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తాను ప్రశ్నించడం ఆపనని, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత పోరాటం కాదని, ప్రజల కోసం చేసే బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ప్రశ్నించే గొంతును ఎవరూ అణచలేరని, ప్రజల ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆ నాయకుడు స్పష్టం చేశారు.



