
ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య
చేర్యాల: ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్త్యాల గ్రామానికి చెందిన అనుముల రాకేశ్ రెడ్డి, తరిగొప్పుల హారిక గత కొన్ని రోజులుగా ప్రేమించుకున్నారు. ఐతే ఇరువురి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.
కాగా ఇరు కుటుంబ సభ్యులు ప్రేమికులను కలవడానికి అవకాశం ఇవ్వక పోవడంతో అమ్మాయి హారిక కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేయడంతో విషయం కాస్త పోలీసు స్టేషన్ వరకు వెళ్ళింది.అయితే పోలీసులు ఇరువురి కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కొద్ది రోజుల సమయం తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని ఒప్పుకున్నారు.
ఐతే కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు కానీ రాకేష్ పురుగుల (గడ్డి మందు) తాగి రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడగా,ప్రియుని మృతిని తట్టుకోలేక మనస్తాపంతో ప్రియురాలు హారిక గురువారం తన అమ్మమ్మ ఊరైన జనగామ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల వ్యవధిలోనే ప్రియులు ఇరువురు మృతి చెందడంతో గ్రామంలో ఈ అంశం చర్చనీయ అంశంగా మారింది.



