
గురుకుల పాఠశాలలో మరో విద్యార్థిని ఆత్మ*హత్యాయత్నం
చెన్నూరు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో జరుగుతున్న వరుస ఘటనలతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా భయాందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
వారం క్రితం ఇదే పాఠశాలలో చదువుతున్న శ్రీహిందు ఆత్మహత్యను మరువకముందే శనివారం సాయంత్రం ఆరు గంటలకు మరో విద్యార్థిని డెట్టాల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
పోలీసులు, పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వ గ్రామానికి చెందిన గొట్టాల శరణ్య చెన్నూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నదని, తోటి స్నేహితురాలితో గొడవ పెట్టుకున్న శరణ్య పక్కనే ఉన్న బాత్రూము వెళ్లి డెట్టాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు.
ఇది గమనించిన పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం బాధితురాలికి చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు.




