
పాలేరు పంచాయతీ కార్యదర్శి పై అవినీతి ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు
Web desc : పాలేరు గ్రామ పంచాయతీ కార్యదర్శి పై పలు పత్రికల్లో అవినీతి ఆరోపణలు రావడంతో సోమవారం డీపీవో రాంబాబు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.అంతేకాక, విచారణ పూర్తయ్యే వరకు కార్యదర్శి హరీష్ను విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు.
పాలేరు గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ ఆస్తి వివాదం విషయమై కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులు వచ్చిన అనంతరం వారి ఇళ్లను వాటాలుగా పంచుకొని, ఆ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీలో నమోదు చేసి ఇంటి నంబర్ కేటాయించాలని కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నారు.
అయితే, సదరు పంచాయతీ కార్యదర్శి వారిని చాలాకాలం పాటు తిప్పించి, లంచం తీసుకున్న తర్వాతే ఇంటి నంబర్ కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం గ్రామంలోని సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అయింది. కొన్ని పత్రికల్లో ఈ అవినీతి వ్యవహారం పై పూర్తి కథనాలు వెలువడడంతో జిల్లా పంచాయతీ అధికారులు కూసుమంచి మండల పంచాయతీ అధికారులను శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.
అదే విధంగా, గ్రామసంత వేలం సమయంలో కూడా కార్యదర్శి సిండికేట్ వ్యక్తులకు సహకరించి, వేలం ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ తక్కువ ధరకే ముగిసేలా చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కార్యదర్శి పై విచారణ ప్రారంభించడాన్ని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



