
కారు అదుపుతప్పి బోల్తా పడి మైనర్ బాలిక మృతి
Web desc : కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ మైనర్ బాలిక మృతి చెందిన సంఘటన ఏడుపాయల ఆలయ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది.
ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. హైద్రాబాద్ లోని బేగంపేటకు చెందిన బాలిక (17) ఇంటర్ పూర్తి చేసింది. గత కొంతకాలంగా హైదరాబాద్ ఫతేనగర్ ప్రాంతానికి చెందిన గొల్ల చింటూ(17) అనే మైనర్ యువకుడు బాలికను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు.
ఈ విషయంలో ఇది వరకు రెండు, మూడు సార్లు బాలిక కుటుంబీకులు అతన్ని మందలించారు. అయినా తీరు మారలేదు. ఈ క్రమంలో శనివారం బాలికబఇంట్లో వారికి చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్లింది.
చింటూతో పాటు అతని స్నేహితులు మనోహర్, శివ కుమార్ లు కలిసి శనివారం రాత్రి ఏడుపాయలకు ఇన్నోవా కారులో బయలుదేరారు. చింటూ కారు నడుపుతుండగా బాలిక తో పాటు మిగిలిన వారు వెనక కూర్చున్నారు.
రాత్రి సమయంలో ఏడుపాయలకు చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆకలి వేస్తుందని భోజనం చేయడానికి పోతంశెట్టిపల్లి వైపు వెళ్తుండగా బస్టాండ్ సమీపంలోకి రాగానే కారు అతివేగంతో డివైడర్ ను ఢీ కొట్టడంతో పల్టీలు కొట్టి బోల్తా పడింది. అటుగా వెళ్లిన వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి బాలిక అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చింటూ, మనోహర్, శివకుమార్ లకు స్వల్పగాయాలయ్యాయి.
ఇంట్లో తెలియకుండా తన కూతురిని తీసుకువచ్చి ఆమె మృతికి కారణమైన మైనర్ గొల్ల చింటూపై చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.