
పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్లు..
మొదటి దశలో జిహెచ్ఎంసీ పరిధిలో..
జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పేదలు ఉన్నచోటే జి+3 పద్దతిలో ఇండ్ల నిర్మాణం.
స్ధలాల గుర్తింపుపై నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమావేశం.
గ్రామీణ ప్రాంతాల్లో మొదటి దశ ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిన నేపధ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలిపారు. పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసిస్తున్న చోటనే జి+3 పద్దతిలో ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణను సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో హౌసింగ్ అధికారులతోపాటు జిహెచ్ఎంసీ కమీషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో పట్టణాలలో ఇందిరమ్మ ఇండ్లు, 2 బిహెచ్కే ఇండ్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని ముఖ్యంగా హైదరాబాద్కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఇష్టపడడం లేదన్నారు. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లలోకి పేదలు వెళ్లడం లేదని, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని త్వరలో మొదటిదశ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభిస్తామని తెలిపారు.
పట్టణ పరిధిలోని మురికివాడల్లో నివసిస్తున్న వారికి అక్కడే జి+3 పద్దతిలో ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి వీలుగా స్ధలాలను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ స్ధలాలు, ప్రైవేటు వ్యక్తులకు చెంది పేదల అధీనంలో ఉన్న స్దలాలతో పాటు కబ్జాకు గురైన ప్రాంతాలను కూడా గుర్తించాలని, అదేవిధంగా భూదాన్ భూములను పేదల ఇండ్ల కోసం వినియోగించే వెసులుబాటు ఉన్నందున అటువంటి భూములను గుర్తించి సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని దీనికోసం ప్రతి జిల్లా కలెక్టర్ తమ పరిధిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని సూచించారు.
జిహెచ్ఎంసీ పరిధిలో గల 166 మురికివాడలలో సుమారు 42,432 మంది నివసిస్తున్నారని , ఇంతవరకు హైదరాబాద్ జిల్లాలో 106, సంగారెడ్డిలో 5, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 12, రంగారెడ్డిలో 26 మురికివాడలలో సర్వే నిర్వహించి 25,501 కచ్చా ఇండ్లలో పేదలు ఉంటున్నట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. దీనిపై మరింత లోతైన పరిశీలన జరిపి ఎన్ని మురికివాడల్లో ఎంత భూమి అందుబాటులో ఉంది, జి+3 పద్దతిలో ఎన్నిఇందిరమ్మ ఇండ్లు నిర్మించవచ్చు అనే అంశాలపై ఈనెలాఖరులోగా పూర్తిస్దాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గానికి తొలి విడతగా ఇచ్చినట్లు 3,500 ఇండ్లకు బదులు పట్టణ నియోజకవర్గాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకొని అదనంగా ఇండ్లను మంజూరు చేయాలని నిర్ణయించామని మంత్రిగారు తెలిపారు.
2 బిహెచ్కె ఇండ్లకు సంబంధించి సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరిల్లో కేటాయించిన వాటిలోకి హైదరాబాద్లో నివసిస్తున్నవారెవరూ అక్కడికి వెళ్లడం లేదని ఫలితంగా 30 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఇండ్ల కేటాయింపు పొంది అక్కడ నివసించని వారందరికీ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 2 బిహెచ్ కేలను పూర్తిచేయాలని అలాగే వాటర్, కరెంట్, డ్రైనేజ్ వంటి కనీస వసతులను కల్పించి మిగిలిపోయిన 2 బిహెచ్ కే ఇండ్లను ఆగస్టు నెలాఖరులోగా కేటాయింపులు పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ విపి గౌతమ్, జిహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వి కన్నన్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్బంగా హౌసింగ్ కాలనీస్ ఇన్స్పెక్షన్ యాప్ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు.