
గెలిచిన వారే కాదు.. ఓడిన వారూ నా దృష్టిలో సర్పంచులే
ప్రజల పక్షాన.. ప్రగతి పథాన!
పాలేరు నియోజకవర్గ సర్పంచులకు మంత్రి పొంగులేటి ఆత్మీయ నీరాజనం
రూ. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం.. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు
అధికారం పోయినా విర్రవీగితే విజ్ఞత నేర్పుతాం
విపక్షాలకు మంత్రి హెచ్చరిక
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : “పాలేరు నియోజకవర్గంలో వెల్లువెత్తిన ప్రజా చైతన్యం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. ఈ విజయం అహంకారానికి తావు ఇవ్వకూడదు.. బాధ్యతను గుర్తు చేయాలి. గెలిచిన సర్పంచులు ప్రజల కష్టాల్లో తోడుండాలి.
ఎన్నికల్లో గెలిచిన వారే కాదు, స్వల్ప తేడాతో ఓడిన వారు కూడా నా దృష్టిలో సర్పంచులే. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉద్ఘాటించారు.
బుధవారం ఖమ్మం వైరా రోడ్డులోని ఎస్.ఆర్. గార్డెన్స్లో పాలేరు నియోజకవర్గ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ‘ఆత్మీయ సన్మాన సభ’ అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులతో పాటు మిత్రపక్షాల నుంచి ఎన్నికైన వారికి మంత్రి పట్టువస్త్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
ఈ విజయం.. ప్రజా ప్రభుత్వానికి మద్దతు
సభలో మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 134 పంచాయతీల్లో సుమారు 70 శాతం కాంగ్రెస్ మద్దతుదారులు జయకేతనం ఎగురవేయడం శుభపరిణామన్నారు.
“మనలో మనకు ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు పోటీ పడటంతో స్వల్ప తేడాతో సీట్లు చేజారాయి. అయినప్పటికీ, పదేళ్లు ఏలిన వారు నేడు వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయికి పడిపోయారంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారో స్పష్టమైంది” అని విశ్లేషించారు.
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా మెరుగైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధిలో కొత్త పుంతలు
“కేంద్రం సాయం లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వమే రూ. 22,500 కోట్లతో ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోంది.
పాలేరుకు తొలి విడతలో 3,500 ఇళ్లు కేటాయించాం. గత 20 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ రెండేళ్లలో ప్రతి గ్రామంలో కంటికి కట్టినట్లు చూపించాం. సీసీ రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్లు, అగ్రికల్చర్ కనెక్షన్లతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం.
దేశ చరిత్రలోనే తొలిసారి సన్న బియ్యం పంపిణీ ద్వారా పేదవాడి ప్రభుత్వంగా గుర్తింపు పొందాం” అని వివరించారు.
విర్రవీగితే సహించేది లేదు
ప్రతిపక్షాల తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. “గత ప్రభుత్వం కేవలం మాటలతో, ఊహలతో కాలక్షేపం చేసింది. అధికారం పోయినా అహంకారం తగ్గని కొందరు నాయకులకు కాలమే బుద్ధి చెబుతుంది.
మాది కక్షపూరిత ప్రభుత్వం కాదు.. కానీ విర్రవీగితే సహించేది లేదు” అని హెచ్చరించారు. నాయకులు ప్రజలకు దూరం కావొద్దని, ప్రభుత్వం చేస్తున్న పనులను గడప గడపకూ వివరించాలని దిశానిర్దేశం చేశారు.
2025లో తీపి జ్ఞాపకాలు చూశామని, 2026లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో మరిన్ని సంతోషాలు నిండాలని మంత్రి ఆకాంక్షించారు.
ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ…
పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని సర్పంచులు నిలబెట్టుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలని కోరారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి పొంగులేటితో కలిసి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, పాలేరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.




