
వీడియో కాల్ మాట్లాడుతూ ఆపరేషన్.. మృతి చెందిన మహిళ.. గ్రామస్థుల ఆందోళన!
జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో.. హస్పటల్ ఎదురుగా గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. డాక్టర్ పద్మిని టెస్టులు చేసి రాజవ్వ గర్భసంచికి గడ్డ ఉందని, తొలగించడానికి ఆపరేషన్ చేయాలని సూచించారు.
గురువారం ఆపరేషన్ చేస్తుండగానే రాజవ్వ చనిపోయింది. కాగా.. హైదరాబాద్ లోని మరో డాక్టర్ వీడియో కాల్ ద్వారా సూచనలు చేస్తుండగా.. ఇక్కడ డాక్టర్ ఆపరేషన్ చేయడం వల్లనే రాజవ్వ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఘటనపై డాక్టర్ ను వివరణ కోరగా.. రాజవ్వకు ముందుగా మత్తు ఇంజక్షన్ ఇచ్చామని, ఆపరేషన్ మొదలుపెట్టగానే గుండెపోటుతో చనిపోయిందని తమ తప్పిదం ఏమీ లేదని తెలిపారు.
వీడియో కాల్ ద్వారా ఆపరేషన్ చేయలేదని చెప్పారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి మృతురాలి బంధువులకు నచ్చజెప్పి.. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.