
సీఎం కు నిరసన సెగ.. కాన్వాయ్ను అడ్డుకునేందుకు రైతుల యత్నం
అనంతపురం జిల్లాలో సీఎం జగన్కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు. సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి వెళ్తుండగా.. ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద సీఎం కాన్వాయ్ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రైతులను పక్కకు లాగేయడంతో సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది.
పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ తుంపర్తి, మోటుమర్రు ప్రాంతంలో 210 ఎకరాలు సేకరించిన అధికారులు.. ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని రైతులు వాపోయారు. పరిహారం ఇప్పించడంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని తీవ్ర ఆవేదన చెందారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు తోసేశారని వాపోయారు.