తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గుషిణి గ్రామానికి చెందిన ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.
దీనిని పోలీసులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుషిణి గ్రామానికి చెందిన చనమల్లు అబద్ధం అనే రైతు 20 ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన కొంతమంది వద్ద ఒకటిన్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అప్పటినుంచి భూమిని తానే సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భూమిని సర్వేచేసి మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశారు. రైతు వద్ద భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవడంతో రెవె న్యూ అధికారులు ఏడాదిగా తిరస్కరిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భూ విక్రయదారులు... అబద్ధం సాగుచేస్తున్న భూమిని వారిపేరున ఆన్లైన్ చేయించుకోవడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు శుక్రవారం ఉదయం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. సాగుబడిలో ఉన్న భూమికి మ్యుటే షన్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపునకు దిగాడు. మ్యుటేషన్ కోసం వీఆర్వో తనను లంచం అడిగారని ఆరోపించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను వారించి పురుగుమందు డబ్బాను లాక్కు న్నారు. అనంతరం న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ భూమి కొనుగోలుకు సంబంధించి రైతు వద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల మ్యుటేషన్ చేయలేకపోతున్నట్టు చెప్పారు. వీఆర్వో గోవింద్ మాట్లాడుతూ రైతు అబద్ధం సాగులో ఉన్న భూమిని ఆయన పేరిట మ్యుటేషన్ చేయాలని రెండు నెలలుగా తనపై ఒత్తిడి తెస్తున్నారని, పట్టా రైతులతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సలహా ఇచ్చానని చెప్పారు. ఆ రైతు నుంచి ఎటువంటి లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు.
