
డిగ్రీ విద్యార్థులకు ‘ఇంటర్న్షిప్’ వరం
103 కళాశాలల్లో 10 కోర్సుల గుర్తింపు
వాటిలో చేరితే వారానికి 3 రోజులు చదువు, 3 రోజులు కొలువు
కొత్త విద్యా సంవత్సరం నుంచే అమలు
అమెరికాలో ఒకవైపు చదువుకుంటూనే వివిధ దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేస్తూ విద్యార్థులు కొంత మొత్తాన్ని సంపాదించడం అందరికీ తెలుసు. అదే తరహాలో డిగ్రీ కళాశాలలో చేరిన మొదటి నెల నుంచే రూ.10 వేల వేతనం అందుకునే అవకాశం మన రాష్ట్రంలోని విద్యార్థులకూ ఎంతో దూరంలో లేదు. ఈ కొత్త విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచే 103 కళాశాలల్లో ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో అవసరమైన కసరత్తును దాదాపు పూర్తి చేసింది. అధికారులే ఆయా ప్రాంతాల్లో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలను ఎంపిక చేస్తారు. విద్యార్థులు వారంలో 3 రోజులు కళాశాలలో పాఠాలు వినాల్సి ఉంటుంది. మరో 3 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
37 ప్రభుత్వ, 66 ప్రైవేటు కళాశాలలు
రాష్ట్రంలోని 37 ప్రభుత్వ, 66 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థుల సంఖ్య 500 మందికి మించి ఉండాలనే నిబంధన పాటించారు. అయితే వీటిలో ఉన్న అన్ని కోర్సుల్లో కాకుండా… ఎంపిక చేసిన పది కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి మాత్రమే రూ.10 వేల వేతనం ఇచ్చే సౌలభ్యం వర్తిస్తుంది. బీబీఏ(రిటైలింగ్), బీబీఎస్(ఈ-కామర్స్), బీబీఏ(లాజిస్టిక్స్), బీఎస్సీ(ఫిజికల్ సైన్స్), బీఏ(కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్)లో చేరిన వారికి ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
వీటితోపాటు బీకాం(ఈ-కామర్స్), బీకాం(హాస్పిటల్ మేనేజ్మెంట్)తోపాటు మరికొన్ని కలిపి మొత్తం 10 కోర్సుల వరకు కొత్త విధానంలోకి తీసుకోవాలన్నది విద్యామండలి లక్ష్యంగా కనిపిస్తోంది. కాకపోతే ఒక్కో కళాశాలలో ఒకటీ లేదా రెండు కోర్సులకు మాత్రమే దీన్ని వర్తింపజేస్తారు.
పేద తల్లిదండ్రులపై భారం ఉండదు
ఎంతో మంది పేద విద్యార్థులు ‘దోస్త్’తో హైదరాబాద్, ఇతర నగరాలకు వచ్చి పేరెన్నికైన డిగ్రీ కళాశాలల్లో చేరుతున్నారు. వారికి హాస్టల్, ప్రయాణ, ఇతర ఖర్చులు భారంగా మారుతున్నాయి. దానికితోడు డిగ్రీ పూర్తయితే చదువుకు తగ్గ కొలువును సాధించుకోవచ్చన్న నమ్మకాన్ని ప్రస్తుతం వారికి ఇవ్వలేకపోతున్నాం.
ఈ పరిస్థితిని మార్చేందుకే కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ పరిధిలోని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎన్ఎస్డీసీ) సహకారం తీసుకుంటున్నాం. వారంలో మూడు రోజులపాటు పరిశ్రమలు, ఇతర స్టోర్లలో పనిచేస్తే ఆ హాజరును పరిగణనలోకి తీసుకుంటాం. మొత్తానికి పేద తల్లిదండ్రులపై ఆర్థిక భారం తప్పడంతోపాటు విద్యార్థులకూ కొలువుకు తగిన నైపుణ్యాన్ని సాధించామన్న ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వగులుగుతాం.