ఆధార్ లేకపోతే వైద్యం చేయరా? మహిళకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

ఉస్మానియా వైద్యులపై మంత్రి దామోదర ఆగ్రహం
ఆధార్ లేకపోతే వైద్యం చేయరా?
మహిళకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఒక మహిళకు వైద్యం నిరాకరించిన ఉస్మానియా ఆసుపత్రి వైద్యులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశా రు.
అనారోగ్యంతో ఉన్న ఆ మహిళకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు.
నాగర్కర్నూల్ జిల్లా యడ్లపల్లి చెందిన ప్రమీల అనారోగ్యంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లగా, ఆమెకు ఆధార్కార్డు లేదని వైద్యం చేసేందుకు నిరాకరించినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి ఆదివారం స్పందించారు.
అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వారికి ఆధార్ లేకుంటే వైద్యం చేయరా? అని ప్రశ్నించారు. ఏదో ఉద్యోగంలా కాకుండా మానవత్వంతో రోగులకు చికిత్స అందించాలని హితవు పలికారు.
ఆధార్ లేకున్నా ఉస్మానియాలో వైద్యం: డాక్టర్ రాకేశ్
ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవల కోసం ఆధా ర్కార్డు తప్పనిసరి కాదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ తెలిపారు.
ఆసుపత్రి లో నిత్యం సుమారు 3,000 మందికి ఓపీ వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆధార్ కార్డు లేదన్న కారణంతో ప్రమీల అనే మహిళకు వైద్యం నిరాకరించిన ఘటనపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆధార్కార్డు నమోదు చేయడం వల్ల రోగులకు భవిష్యత్తులో అందించే వైద్య సేవలు, మందుల పంపిణీ, ఇతర మెరుగైన వైద్య సేవలకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.
ప్రమీళ ఈ నెల 8న ఉస్మానియాకు రాగా, అదే రోజు ఆధార్ కార్డు లేకున్నా వైద్యం అందించినట్లు తెలిపారు.
ఆమె ఆసుపత్రి బయట ఉండడంతో ఆరోగ్యం క్షీణించిందని, ఆదివారం ఉదయం అఫ్జల్గంజ్ పోలీసులు ఆమెను తీసుకురావడంతో ఇన్పేషంట్ గా చేర్చుకొని వైద్యం ప్రారంభించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ప్రమీలను నాంపల్లి క్రిమినల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ జావేద్ పాషా ఆదివారం పరామర్శించారు.
