చెత్తలో కూర్చొని ఎమ్మెల్యే ధర్నా...

చెత్తలో కూర్చొని ఎమ్మెల్యే ధర్నా...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మచ్చబొల్లారంలోని డంపింగ్ యార్డును ఎత్తివేయాలంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఆదివారం చెత్తలో కూర్చొని ధర్నా చేశారు.
పరిసర కాలనీల వాసులు ఆయనకు మద్దతు తెలిపారు. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా పట్టించుకోకుండా.. సుమారు రెండు గంటల పాటు దుర్వాసనను భరిస్తూ ఆయన అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గతంలో దాత వెంకట్రెడ్డి 15 ఎకరాల భూమిని శ్మశానం కోసం ఇచ్చారని, ఆ స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చడంతో కాలుష్యం పెరిగి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
డంపింగ్ యార్డు ప్రాంతంలో కొందరు నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చి వెళ్లిపోగా కాలనీవాసులు మాత్రం రాత్రి వరకు ధర్నా కొనసాగించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టుచేసి, తరువాత వదిలిపెట్టారు.
శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అభ్యంతరం ఏంటంటూ 30 కాలనీల ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించారు. మహిళల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.
అనుమతి లేకుండా ధర్నా చేయడంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆందోళనకు భాజపా నేతలు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో కార్పొరేటర్ విజయశాంతి, ఎంబీసీ మాజీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్, ఐకాస నేతలు పాల్గొన్నారు.
