రాజకీయంగా మారిన పంచాంగం ఏది నిజం?

ఎవరి పంచాంగం వారిదే !
రాజకీయంగా మారిన పంచాంగం ఏది నిజం?
రాజకీయ పార్టీలు ఉగాది పండుగను ఘనంగా నిర్వహిస్తాయి. తెలుగు సంవత్సరాదిని గొప్పగా ప్రారంభించాలని అనుకుంటాయి. అందుకే అనుకూలంగా పంచాంగం చెప్పే వారిని మాత్రమే ఆహ్వానిస్తాయి. తమను ఏ పార్టీ ఆహ్వానిస్తే ఆ పార్టీకి తగ్గట్లుగా పంచాంగాన్ని అనుకూలంగా చెప్పడాన్ని ఆయన పండితులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి వస్తారు. ఈ ఏడాది కూడా అదే కనిపించింది.
చంద్రబాబుకు తిరుగులేదని మాడుగుల పంచాంగం
ఏపీలో చంద్రబాబు ఆరోసారి సీఎం అవుతారని మాడుగుల నాగఫణి శర్మ చెప్పుకొచ్చారు . చంద్రబాబుకు విజన్ ఉందని అందుకే అమరావతిని అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అదో విశ్వనగరం అవుతుందన్నారు. నిజానికి పంచాంగం ఏడాదికే ఉంటుంది. మాడుగల మాత్రం జ్యోతిష్యం చెప్పేశారు. ఆయన చెప్పిన మంచి మాటలకు టీడీపీ ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు.
రేవంత్ ప్రజారంజక పాలన అందిస్తారన్న సంతోష్ కుమార్ శాస్త్రి
ఇక తెలంగాణలో సీఎం రేవంత్ పాల్గొన్న పంచాంగంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పాలకులు పోటీపడి పాలన సాగిస్తారని చెప్పారు. ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన సాగిస్తారని అన్నారు. ప్రజలకు నచ్చే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటుందని పండితులు సంతోష్ కుమార్ శాస్త్రీ పంచాంగం చెప్పారు. ఆర్థిక భారం ఎక్కువగానే ఉంటుందని.. ప్రజలకు డబ్బు బాగానే సిద్ధిస్తుందన్నారు. రాష్ట్రానికి ఆదాయం రావడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. పొరుగు రాష్ట్రాలతో నీటి విషయంలో సమస్యలు వస్తాయనన్నారు. ప్రకృతి విపత్తులు వచ్చే చాన్స్ ఉందన్నారు.
రేవంత్ కు పదవీ గండం ఉందన్న బీఆర్ఎస్ పంచాంగం
రేవంత్ కు పదవీ గండం ఉందని బీఆర్ఎస్ కార్యాలయంలో పంచాయంగం చెప్పిన రాజేశ్వర్ సిద్దాంతి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పై మీడియా దుష్ప్రచారం చేసే అవకాశం ఉందని తెలిపారు. మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సిద్ధాంతి సలహా ఇచ్చారు. వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీదే విజయమని పంచాంగంలో ఉందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది కన్యా రాశి కాబట్టి పదవీగండాలు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రజలు ఎన్నికల్లో తప్పు చేశారని వైసీపీ పంచాంగం
ఉగాది రోజు సెట్టింగులు వేసుకునే జగన్ ఈ సారి పదవి లేకపోవడంతో ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు. అంబటి రాంబాబు నేతృత్వంలో పంచాంగం చెప్పించారు. పంచాంగ కర్త నారాయణమూర్తి జగన్ ను..కృష్ణదేవరాయులు మాదిరి చరిత్రలో నిలిచిపోతారని కీర్తించారు. ఆయనకు భయం ఉండదన్నారు. విచిత్రం ఏమిటంటే ప్రజలు జగన్ ను ఓడించి తప్పు చేశారని చింతిస్తున్నారట. ఊరందరికి ఒక దారి అయితే.. వైసీపీ మరో దారి అన్నట్లుగా ఉంటుంది.
