ఇసుక మాఫియా పై ఉక్కుపాదం మోపండి
![ఇసుక అక్రమ రవాణా వెంటనే అరికట్టండి ఇసుక అక్రమ రవాణా వెంటనే అరికట్టండి](https://cknewstv.in/h-upload/2025/02/10/1974445-img-20250210-wa0062.webp)
ఇసుక అక్రమ రవాణా వెంటనే అరికట్టండి
సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.
ఆ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని చెబుతూ అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరగాలని, విధి నిర్వహణలో పర్మనెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.
బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. అందుకు జిల్లాల వారిగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి.
అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలి. ప్రతి రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలి. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలి.
రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేయాలి. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి. ప్రాంతాల వారిగా సమీప రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థ ఏర్పడాలి.
సమస్య తలెత్తినప్పుడు వెంటనే పరిష్కారం జరగాలి. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించిన సీఎం
నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి.
ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులు జరగాలి. ఆఫీస్ టైమింగ్స్లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలి.
ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ , హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![Ck News Tv Ck News Tv](/images/authorplaceholder.jpg?type=1&v=2)