PoliticalTelangana

మాతో గోక్కున్న వాడెవ‌డూ బాగుప‌డ‌లే….

మాతో గోక్కున్న వాడెవ‌డూ బాగుప‌డ‌లే….

కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు బీజేపీ-బీఆర్ఎస్ కుట్ర‌లు

మేం గేట్లు తెరిస్తే కేసీఆర్ ఇంట్లో వాళ్లు త‌ప్ప అంతా కాంగ్రెస్ జెండా క‌ప్పుకుంటారు..

ఇందిర‌మ్మ రాజ్యాన్ని కాపాడుకునేందుకు సిద్దంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

మ‌ణుగూరు ప్ర‌జా దీవెన స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

మ‌ణుగూరు: తెలంగాణ‌లో ఇందిర‌మ్మ రాజ్యంలో అభ‌య‌హ‌స్తం ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంద‌ని, తెలంగాణ గ‌డ్డ‌పై కాంగ్రెస్ జెండా ఎగురుతుంద‌ని గుర్తించినందునే బీజేపీ, బీఆర్ఎస్ క‌లిసి కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. మ‌ణుగూరు ప్ర‌జా దీవెన స‌భ‌లో ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సోమ‌వారం సాయంత్రం ప్ర‌సంగించారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌య్యాక ఈ ప్ర‌భుత్వం ఉండ‌ద‌ని బీజేపీ నాయ‌కుడు డాక్టర్ ల‌క్ష్మ‌ణ్ రోజుకోసారి అంటున్నార‌ని, ఆ పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌తో ఎలా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మ‌క్కై, కుట్ర చేసి ఈ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని ఆలోచ‌న చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ,బీఆర్ఎస్ కుమ్మ‌క్కై కుట్ర‌లు చేస్తున్నాయ‌ని, ఇందులో భాగంగానే బీజేపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన 9 సీట్ల‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని, బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన నాలుగు సీట్ల‌లో బీజేపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ప‌ర‌స్ప‌రం ప్ర‌చారం చేసుకునేందుకే అలా చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వ‌ర‌రావు, మాలోత్ క‌విత‌ల‌కు ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ టిక్కెట్లు ఎందుకు ప్ర‌క‌టించ‌లేదో తెలియ‌జేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కేసీఆర్‌, హ‌రీశ్‌రావు ఎమ్మెల్యేలుగా ఉన్న మెద‌క్ లోక్‌స‌భ స్థానానికి ఎందుకు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేద‌ని, అక్క‌డ‌ అభ్య‌ర్థి దొర‌క‌డం లేదా అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

కేసీఆర్ బిడ్డ క‌విత గ‌తంలో పోటీ చేసిన నిజామ‌బాద్ నుంచి ఆమెను ఎందుకు అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం లేద‌ని, ఆమెకు టిక్కెట్ ఇవ్వ‌రా, లేక అక్క‌డ ప్ర‌జ‌లు మ‌రోసారి బండ‌కేసి కొడ‌తార‌ని అనుమానమా అని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. మొన్న‌టి వ‌ర‌కు మంత్రిగా ఉన్న త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కుమారుడు గ‌తంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశార‌ని, ఇప్పుడు ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌డం లేదా తెలియ‌జేయాల‌న్నారు. క‌లిసి క‌నిపిస్తే తెలంగాణ ప్ర‌జ‌లు చెప్పుతో కొడ‌తార‌నే భ‌యంతో, చీక‌ట్లో ఒప్పందం చేసుకొని అలాయ్ బ‌లాయ్ చేసుకొని మోదీ, కేడీ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కుట్ర‌లు చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు.

నైతిక‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేయాల‌నుకుంటున్నాం….
బీజేపీ, బీఆర్ఎస్ క‌లిసి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు కుట్ర‌లు చేస్తుండంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందిర‌మ్మ రాజ్యాన్ని కాపాడుకునేందుకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని త‌న‌తో చెబుతున్నార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇన్నేళ్లు తాము బీఆర్ఎస్‌లో పార్టీలో ఉన్నా గ‌తంలో ఒక్క‌రోజు ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌లేద‌ని, ఆయ‌న‌ త‌మ మాట విన‌లేద‌ని, ఆయ‌న ఎట్ల‌ ఉన్న‌డో తాము చూడ‌లేద‌ని వారు వాపోయార‌న్నారు.

కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం వ‌చ్చాక మంత్రులు స‌చివాల‌యంలో ఉంటున్నార‌ని, ముఖ్య‌మంత్రిని ఇంటి ద‌గ్గ‌ర‌, స‌చివాయంలో పేద‌లు, కార్య‌క‌ర్త‌లు, ఆడ బిడ్డ‌ల‌ను క‌లుస్తున్నార‌ని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నార‌న్నారు. ముఖ్య‌మంత్రి అధికారులను క‌లుస్తూ స‌మీక్ష‌లు చేస్తూ అభివృద్ధి చేస్తున్నందున, అయిదేళ్లు కాంగ్రెస్‌ ప్ర‌భుత్వాన్ని కాపాడే బాధ్య‌త త‌మ‌ద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త‌న‌ను క‌లిసి చెబుతున్నార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.

ఒక వేళ తాను గేట్లు తెరిస్తే కేసీఆర్‌, ఆయ‌న కొడుకు, అల్లుడు త‌ప్పితే బీఆర్ఎస్ నేత‌లంతా కాంగ్రెస్ జెండా క‌ప్పుకొనిఇందిర‌మ్మ రాజ్యానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండ‌గా నిల‌బ‌డ‌తార‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే వెంక‌ట్రావు త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. తాము మ‌ర్యాద‌పూర్వ‌కంగా, నైతిక‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేయాల‌నుకుంటున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. త‌మ‌ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని మోదీ, కేడీ క‌లిసి కుట్ర‌లు చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. త‌మ‌కు లోతు, ఎత్తులు తెలుస‌ని, ఏం చేయాలో తెలుస‌ని వ్యాఖ్యానించారు.

తాము అల్లాట‌ప్పాగా రాలేద‌ని, న‌ల్ల‌మ‌ల్ల నుంచి తొక్కుకుంటూ వ‌చ్చి ప్ర‌గ‌తి భ‌వ‌న్ బ‌ద్ద‌లుకొట్టి కేసీఆర్‌ను బ‌జారుకు ఈడ్చి ఇందిర‌మ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. త‌మ‌తో గోక్కోవ‌ద్దు.. గోక్కొన్న‌వాడెవ‌డూ బాగుప‌డ‌లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చ‌రించార‌ను. చాలామంది ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ఎక్క‌డ ఉంద‌న్నార‌ని, మ‌ణుగూరు వ‌చ్చి చూస్తే కాంగ్రెస్ ఎక్క‌డ ఉందో తెలుస్తుంద‌న్నారు.

బీఆర్ఎస్ బిల్లా రంగా స‌మితి….
ఇందిర‌మ్మ ఇల్లు వ‌ద్దు… అవి డ‌బ్బా ఇల్లు అంటూ కేసీఆర్ భాష‌, యాస‌ల‌తో మోస‌గించార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. సూర్యుడి తూర్పున ఉద‌యించి… ప్ర‌పంచానికి ఎలా వెలుగు ఇస్తాడో.. అలానే తెలంగాణ‌కు ఖ‌మ్మం జిల్లా భ‌ద్రాచ‌లం, మ‌ణుగూరు తూర్పునే ఉంటుంద‌ని, అందుకే ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కాన్ని భ‌ద్రాచ‌లంలో శ్రీ‌రామ‌చంద్రస్వామి ఆశీర్వాదంతో ప్రారంభించామ‌న్నారు.

తాము మంచి చేస్తుంటే చూడ‌బుద్ది కాక తండ్రీకొడుకులు, బిడ్డ అల్లుడు శాపాలు పెడుతున్నార‌ని, పిల్లి శాపాల‌కు ఉట్టి తెగుప‌డుతుందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 90 రోజుల్లోనే తాము హామీల‌న్నీ అమ‌లు చేస్తున్నామ‌ని, బీఆర్ ఎస్ ఇచ్చిన హామీలు ప‌దేళ్ల‌లో అమ‌లయ్యాయా అని కేటీఆర్ ఆయ‌న తండ్రి కేసీఆర్‌ను ప్ర‌శ్నించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. తాము 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామ‌ని, గ‌త ప్ర‌భుత్వంలో ఉద్యోగాలు రాక‌, ప్ర‌శ్నాప‌త్రాలు లీకై నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లుచేసుకుంటుంటే ఒక్క‌నాడైనా కేసీఆర్‌, హ‌రీశ్‌రావు, కేటీఆర్ ప‌రామ‌ర్శించారా అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా స‌మితి అని, హ‌రీశ్‌రావు, కేటీఆర్ రాష్ట్రాన్ని కొల్ల‌గొట్టిన తోడు దొంగ‌లని ముఖ్యమంత్రి మండిప‌డ్డారు.

కేసీఆర్ ఛార్లెస్ శోభ‌రాజ్ అని, ఆయ‌న పాపాల‌తో కాళేశ్వ‌రం కూలిపోయి, మేడ‌గ‌డ్డ మేడిపండై, అన్నారం ప‌గిలిపోయి సుందిళ్ల దెబ్బ‌తింద‌ని ముఖ్య‌మంత్రి ఆరోపించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజీవ్ సాగ‌ర్‌, ఇందిరా సాగ‌ర్ ప్రారంభిస్తే సీతారామ‌, భ‌క్త‌రామ‌దాసు ఎత్తిపోత‌ల పేరుతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.కోట్లు కొల్ల‌గొట్టి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు తాగ‌డానికి నీళ్లు లేకుండా చేసింద‌ని ముఖ్య‌మంత్రి ఆరోపించారు.

మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కురాలు సోనియా గాంధీ
ఈ దేశంలో మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కురాలు సోనియా గాంధీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. 2004లో క‌రీంన‌గ‌ర్ స‌భ‌లో తెలంగాణ ఇస్తామ‌ని హామీ ఇచ్చి దానిని సోనియా గాంధీ నెర‌వేర‌ర్చార‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

గ‌తేడాది సెప్టెంబరు 17న తుక్కుగూడ స‌భ‌లో అభ‌య‌హ‌స్తం కింద ఆరు గ్యారెంటీల‌ను సోనియా గాంధీ ఇచ్చార‌ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే వాటిని అమ‌లు చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఉచిత బ‌స్సులో ఇప్ప‌టికే 24 కోట్ల మంది మ‌హిళ‌లు ప్ర‌యాణాలు చేశార‌ని, భ‌ద్రాచ‌లం శ్రీ‌రామ‌చంద్ర‌స్వామి, యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యం, ములుగు స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ద‌ర్శ‌నానికి ఉచిత బ‌స్సుల్లో మ‌హిళ‌లు వెళ్లి వ‌స్తున్నార‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ఆరోగ్య శ్రీ ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.ప‌ది ల‌క్ష‌ల‌కు పెంచామ‌ని గుర్తు చేశారు.

ఆడ బిడ్డ‌ల‌కు సోనియ‌మ్మ రూ.400కు ఇచ్చిన గ్యాస్ సిలిండ‌ర్‌ను న‌రేంద్ర‌మోదీ, కేసీఆర్ వ‌చ్చాక రూ.1200కు పెంచి ఆడ బిడ్డ‌ల సొమ్ము దోచుకునే పాపాపానికి ఒడిగ‌డుతుంటే సోనియామ్మ రూ.500 కే సిలెండ‌ర్ ఇస్తామ‌ని చెప్పార‌ని, ఆమె మాట మేర‌కు ఇప్పుడు రూ.500కే సిలిండ‌ర్ ఇస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇస్తూ పేదల ఇళ్ల‌లో వెలుగులు నింపుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

ఖ‌మ్మం జిల్లా గ‌డ్డ‌పైనే తెలంగాణ ఉద్య‌మం మొద‌లు…
ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో పాల్వంచ‌లో ఒక ఉద్యోగం కోసం 1969 తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ గ‌డ్డ మీద నుంచి మొద‌లైన ఉద్య‌మం
స్ఫూర్తితో 60 ఏళ్ల ఆకాంక్ష నెర‌వేరి తెలంగాణ ఏర్ప‌డింద‌ని, తాను ఈ రోజు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా మాట్లాడ‌డానికి ఖ‌మ్మం జిల్లా ప్రారంభించిన పోరాట‌మే కార‌ణ‌మ‌న్నారు. ఖ‌మ్మం గ‌డ్డ మీద గాలి, ఈ నేల నీరు నింపిన ఉద్య‌మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధ‌న సాధ్య‌మైంద‌న్నారు.

సాధించిన తెలంగాణలో రాష్ట్రంలో కేసీఆర్ ప‌దేళ్లు ముఖ్య‌మంత్రి అయి ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు, గిరిజ‌నుల‌కు పోడు భూముల‌కు ప‌ట్టాలు, గిరిజ‌నులు, మైనారిటీల‌కు 12 శాతం చొప్పున రిజ‌ర్వేష‌న్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ర‌క‌ర‌కాల హామీలు ఇచ్చి తెలంగాణ స‌మాజాన్ని మోసం చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు.

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు ప్రాధాన్యం…
ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా ప్ర‌జ‌లు 2014, 2018, 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను న‌మ్మ‌లేద‌ని, ప్ర‌తి సారి ఆ పార్టీని ఒక్క సీటుకే ప‌రిమితం చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

గ‌త మూడు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను వంద మీట‌ర్లు లోతున బొంద‌పెట్టిన చ‌రిత్ర ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాద‌న్నారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్య‌మ‌ని, అందుకే ఉప ముఖ్య‌మంత్రిగా భ‌ట్టి విక్ర‌మార్క‌, రెవెన్యూ, గృహ‌నిర్మాణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, అత్యంత కీల‌క‌మైన వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అయ్యార‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

రెండు రాజ్య‌స‌భ సీట్లు వ‌స్తే ఒక‌టి జిల్లాకు చెందిన రేణుకా చౌద‌రికి సోనియా గాంధీ ఇచ్చార‌ని, మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఇటు రేణుకా చౌద‌రి, అటు బ‌ల‌రాం నాయ‌క్‌కు కేంద్ర మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించార‌ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. తాను 2007లో తొలిసారి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు వ‌చ్చాన‌ని, ఈ 18 ఏళ్ల‌లో ఎప్పుడు వ‌చ్చినా, ఎన్ని క‌ష్టాల్లో వ‌చ్చినా త‌న‌కు జిల్లా ప్ర‌జ‌లు అండ‌గా నిలిచార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

త‌న‌కు, ఈ జిల్లా కార్య‌క‌ర్త‌ల‌కు ర‌క్త‌ సంబంధం లేక‌పోయినా కాంగ్రెస్ జెండాను భుజాల‌పై మోసి, ర‌క్తాన్ని చెమ‌ట‌గా మార్చి మొన్న‌టి ఎన్నిక‌ల్లో ప‌దిలో 9 శాస‌న‌స‌భ సీట్ల‌ను గెలిపించి ఇందిర‌మ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇక్క‌డి కార్య‌క‌ర్త‌లే ఏర్పాటు చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు…

ల‌క్ష‌న్న‌ర ఓట్ల‌తో గెలిపించండి..
గోదావ‌రి క‌ర‌క‌ట్ట‌నిర్మాణం, గోదావ‌రి వ‌ర‌ద ముంపు బాధితుల‌కు ఇళ్ల ప‌ట్టాలు, సీతారామ ప్రాజెక్టులో కొన్ని భాగాల అభివృద్ధి, పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణం, పోడు భూములకు ప‌ట్టాలు ఇవ్వాల‌ని పిన‌పాక ఎమ్మెల్యే పాయం వెంక‌టేశ్వ‌ర్లు కోరార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ ప్రాజెక్టుల‌పై స‌వివ‌రంగా స‌మీక్షించి నిర్ణయం తీసుకంటామ‌ని చెప్పారు. మ‌హ‌బూబాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌ల‌రాం నాయ‌క్‌ను 1.50 లక్ష‌ల ఓట్ల‌తో గెలిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాంతంలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే బాధ్య‌త తీసుకుంటామ‌ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!