రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ డకౌట్ ఖాయం..!

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ డకౌట్ ఖాయం..!
మీ కథేంది… మీ చరిత్రేంది… మాకు తెల్వదా…?
పెయిడ్ ఆర్టిస్టులు… ప్యాకేజీ ఆర్టిస్టులను పెంచి పోషించేది మీరు
ఒక చోట కూర్చుని మీడియా సమావేశం పెట్టలేని మీరా…? పొంగులేటి గురించి మాట్లాడేది…?
బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చిన పొంగులేటి వర్గనేతలు మువ్వా, బేబిస్వర్ణకుమారి, పిడమర్తి రవి, డాక్టర్ కోటా రాంబాబు ఖమ్మం :
పెయిడ్ ఆర్టిస్టులు…. ప్యాకేజీ ఆర్టిస్టులను పెంచి పోషించే మీరా…? పొంగులేటి శీనన్న గురించి మాట్లాడేది… మీ కథేంది…మీ చరిత్రేంది…? పదవులు పొందేందుకు మీరు ఎలాంటి అడ్డదారులు తొక్కారు అనే విషయాలు మాకు తెలియవా…? రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో బీఆర్ఎస్ను డకౌట్ చేయడం ఖాయమని, గతంలో మాదిరిగా ఒకటి అర సీటు కూడా దక్కనివ్వబోమంటూ ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గ నేతలు మువ్వా విజయబాబు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, పిడమర్తి రవి, డాక్టర్ కోటా రాంబాబు తదితర ముఖ్యనేతలు బీఆర్ఎస్ పార్టీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే వెంకటవీరయ్య, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ లపై నిప్పులు చెరిగారు. పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సత్తుపల్లిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఏ విధమైన వాగ్దానాలు చేసింది… అవి ఎంత మేర నెరవేర్చిందనే విషయాలను శీనన్న సభా ముఖంగా ఎత్తిచూపారన్నారు. రెండు సార్లు అధికారం ఇచ్చినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలేదని ఆధారాలతో సహా మాట్లాడితే వాటిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు నోటికి ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేల్చుతున్నారని ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ ఓ దగ్గర, మిగిలిన నేతలంతా ఓ దగ్గర విలేకరుల సమావేశాలు వేరువేరుగా ఏర్పాటు చేశారని ఒక చోట కూర్చుని మీడియా సమావేశం పెట్టే సఖ్యత లేని మీరా..? పొంగులేటి గురించి మాట్లాడేది అంటూ విమర్శించారు. మంత్రిని ఓ వర్గం చేసే ప్రయత్నం జరుగుతుందనే విషయం కూడా గ్రహించలేని పరిస్థితిలో మంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. మూడు లక్షల మంది ఓటర్లు ఉన్న ఖమ్మం నియోజకవర్గంలో 1250 ఇళ్లు మాత్రమే మంజూరు చేశారని దీనిని అభివృద్ధి అంటారా మంత్రి గారు అంటూ విమర్శించారు. సీతారాం ప్రాజెక్టు మొదలు పెట్టి ఏడేళ్లు అవుతున్నా పూర్తి చేయలేదని శీనన్న విమర్శించడం తప్ప అని ప్రశ్నించారు. పెచ్చులు ఉడుతున్న రోడ్లకు ప్యాచ్లు వేయడం, కొత్తగా కట్టిన బస్టాండ్, మున్సిపల్ భవనాలు వర్షాలకు కురవడం అభివృద్దా అని ప్రశ్నించారు. డబ్బు రాజకీయాలు చేసేదేవరో అర్థమవుతుందని గత ఎన్నికల్లో ఒక సీటు గెలిచి మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు పదవులు, డబ్బులను ఆశ చూపించి పార్టీలోకి లాక్కుంది మీరు కాదా అని ఘాటు విమర్శలు చేశారు. శీనన్నది ప్రజాబలం… మీది మదబలం అనే విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. తెదేపాలో ఉంటూ కాంగ్రెస్కు కోవర్టుగా పనిచేసిన సండ్రకు శీనన్న గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఆంధ్రసరిహద్దులో లిక్కర్ దందా, జూదం, కోడి పందాలతో పబ్బం గడుపుకునే సండ్రనా శీనన్న గురించి మాట్లాడేది ఎవరైనా వింటే నవ్విపోదురుగాక..! పొంగులేటి శీనన్న దయతో జెడ్పీచైర్మన్ గా ఎదిగిన లింగాల కమల్ రాజు నీతి, నిజాయతీ, విశ్వసనీయత గురించి మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. దళిత నాయకుడిగా ఎంతమందికి మూడు ఎకరాల భూమిని ఇప్పించావని లింగాల కమల్రాజును ప్రశ్నించారు. ఒకటి మాత్రం నిజం రాబోవు కురుక్షేత్రంలో శీనన్న సునామీలో బీఆర్ఎస్ నేతలంతా కొట్టుకుపోవడం ఖాయమంటూ సమావేశాన్ని ముగించారు.