తండ్రిని కాపాడబోయి తనువుచాలించిన కూతురు...

తండ్రిని కాపాడబోయి తనువుచాలించిన కూతురు...
Web desc : ఇరుగుపొరుగు మధ్య జరిగిన చిన్న ఘర్షణ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
తండ్రిని రాళ్లతో కొడుతున్న పక్కింటి వాళ్ల నుంచి కాపాడబోయి అడ్డం వెళ్లిన కూతురు ప్రాణాలు కోల్పోయింది.
ఆందోలు మండలంలోని అంతారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆందోలు మండలంలోని అంతారం గ్రామానికి చెందిన ఇస్మాయిల్ ఫిబ్రవరి 11వ తేదీన రాత్రి సమయంలో తన ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మల విసర్జన చేస్తుండగా ఇంటి పక్కన నివాసం ఉండే వీరారెడ్డి, విజయ్ రెడ్డి బెదిరించాడు.
ఈ క్రమంలో వారి మధ్య వివాదం నెలకొంది. ఇస్మాయిల్ గొడవ పడుతున్నట్లు శబ్దాలు రావడంతో ఇంట్లో ఉన్న ఇస్మాయిల్ చిన్న కూతురు ఆలియా బేగం (15) బయటకొచ్చింది.
మా నాన్నను కొట్టకండి అంటూ బతిమిలాడింది. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా ఆలియాను పక్కకు నెట్టేసి రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో ఒక రాయి ఆలియాకు బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలింది.
ఇది గమనించిన స్థానికులు ఆలియాను సంగారెడ్డిలోని వెల్నెస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆలియా మరణించింది.
తన కూతుర్ని రాళ్లతో కొట్టి చంపిన వీరారెడ్డి, విజయ్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి ఇస్మాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మునిపల్లి ఎస్సై రాజేశ్ నాయక్ తెలిపారు.
