
కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే.. తెలంగాణలో గెలుస్తామంటున్న కాంగ్రెస్ నేతల ఆశలపై విశ్లేషకులు నీళ్లు చల్లుతున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడి అంశాలే గెలుపును నిర్ణయిస్తాయని పేర్కొంటున్నారు.
తెలంగాణకు సరిహద్దున కర్ణాటక ఉందన్న కారణంతో ఆ ఫలితాలు ఇక్కడ రిపీట్ అవుతాయనడంలో అర్థం లేదని స్పష్టం చేస్తున్నారు.
Karnataka Elections: దక్షిణ భారత దేశంలో ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. అయితే సర్వేలు మాత్రం వాతావరణం కాంగ్రెస్కు అనుకూలంగా ఉందని అంచనా వేస్తున్నాయి. ఇవి కాంగ్రెస్కు ఉత్సాహాన్నిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా కేవలం రెండు, మూడు శాతమే అని, 10, 15 సీట్ల తేడా ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్తోపాటు తెలంగాణ కాంగ్రెస్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది.
కర్ణాటకలో గెలిస్తే తెలంగాణలోనూ గెలుసు సునాయాసం అవుతుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. విశ్లేషకులు మాత్రం కర్ణాటక ఎన్నికలు వేరు.. ఆరు నెలల తర్వాత జరిగే తెలంగాణ ఎన్నికలు వేరని అంటున్నారు. అక్కడి ఫలితాలు ఇక్కడ పెద్దగా ప్రభావం చూపవని పేర్కొంటున్నారు.
స్థానిక అంశాలే ప్రభావితం చేస్తాయి..
కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే.. తెలంగాణలో గెలుస్తామంటున్న కాంగ్రెస్ నేతల ఆశలపై విశ్లేషకులు నీళ్లు చల్లుతున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడి అంశాలే గెలుపును నిర్ణయిస్తాయని పేర్కొంటున్నారు. తెలంగాణకు సరిహద్దున కర్ణాటక ఉందన్న కారణంతో ఆ ఫలితాలు ఇక్కడ రిపీట్ అవుతాయనడంలో అర్థం లేదని స్పష్టం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రభావితం చూసే అంశాలు వేరని, తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు వేరుగా ఉంటాయని చెబుతున్నారు.
అక్కడ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పోటీ..
కర్ణాటకలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో కొన్ని సామాజిక వర్గాలు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా లింగాయత్ల మొగ్గు ఫలితాలను నిర్దేశిస్తుంది. వారు ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారం ఉంది. తెలంగాణ విషయానికి వచ్చే సరికి ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఒక్క విషయంలో తప్ప ఏవిషయంలోనూ కర్ణాటక ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలకు పోలిక ఉండదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనే క్రాస్ ఓటింగ్..
ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లోనే నియోజకవర్గాల వారీగా ఫలితాలు తేడా ఉంటాయి. ఒక అభ్యర్థికి లక్ష మెజారిటీ వస్తే, మరో నియోజకవర్గంలో అదే పార్టీకి చెందిన అభ్యర్థికి వందల్లోనే మెజారిటీ వస్తుంది, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు.
ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించినా, ఓటర్లు విజ్ఞతతో ఓటు వేస్తున్నారు. స్థానికంగా ఎవరు అధికారంలోకి రావాలి, కేంద్రంలో ఓవరు గెలవాలని ఆలోచిస్తున్నారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించిన ఓటర్లు.. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లోనూ లోక్సభలో భిన్నమైన ఫలితాలు వచ్చాయని పేర్కొంటున్నారు.
మొత్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను 10 శాతానికి మించి ప్రభావితం చేయలేవని స్పష్టంగా చెబుతున్నారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు అక్కడి వారికి హామీలు ఇస్తాయని, ఎజెండా రూపొందించుకుంటాయని, తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ఎజెండా ఉంటుందని అంటున్నారు. అలాంటప్పుడు అక్కడి ఫలితాలు, ఇక్కడ ప్రభావింత చేస్తాయనడం ఊహాజనితమే అని పేర్కొంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.