
కాంగ్రెస్ 70 సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తా..
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70-80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు రాకుంటే రాజీనామా చేస్తానని చెప్పారు. నిన్న కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వద్ద కార్యకర్తల మధ్య జన్మదినాన్ని జరుపుకొన్నారు. కార్యకర్తలతో మాట ముచ్చట వేశారు.
రాబోయే ఎన్నికల్లో తనను ప్రజలు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని వెంకట్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీలో వర్గపోరు లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు లింగయ్య, భూపాల్రెడ్డికి రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు రావని చెప్పారు.
నల్గొండలో ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కోమటిరెడ్డి అన్నారు. ఈనెల 26న ముఖ్య నాయకులతో రాహుల్ గాంధీ, ఖర్గే సమావేశం అవుతారని తెలిపారు. 10 రోజుల్లో ప్రియాంకతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బ్రాహ్మణవెల్లంల, ఉదయసముద్రం ప్రాజెక్టుల కోసం తాను మంత్రి పదవిని వద్దనుకోని వైఎస్ తో శంకుస్థాపన చేయించానన్నారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.