
నాటి గఢీలే…. నేటి ఫామ్ హౌస్ లు
కేసీఆర్ వెలిగిపోతుండు.. తెలంగాణ ప్రజలు నలిగిపోతుండ్రు
తెలంగాణలో సీలింగ్ యాక్ట్ అమల్లో ఉందా? లేదా?
కమిషన్ల కోసం ప్రాణహితను చంపేసిన కేసిఆర్
చందన వెళ్లి భూ పరిహార పంపిణీ అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి
ప్రాణహితను చంపేసిన సీఎం కేసీఆర్
పార్టీ మారితే చాలా.. ప్రజల అవసరాలు మంత్రి సబితకు పట్టవా?
రంగారెడ్డి జిల్లా ప్రజలకు సాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడిగే హక్కు బిఆర్ఎస్ కు లేదు
రాష్ట్రంలో ఫాం హౌస్ ల పేరిట నాటి గఢీల పునర్నిర్మానం జరుగుతున్నదని, ఇది తెలంగాణ పునర్నిర్మాణం ఎట్లా అవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. శుక్రవారం పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేవెళ్ల నియోజకవర్గం ఐతాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి తో కలిసి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ను మోడల్ గా తీసుకున్న ఆయన తాబేదారులైన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో వందల ఎకరాల్లో ఫాం హౌజుల పేరిట గడీలు నిర్మాణం చేసుకొని విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడాన్ని చూస్తుంటే.. రాష్ట్రంలో భూసంస్కరణల చట్టం, సీలింగ్ యాక్ట్ అమలులో ఉందా? లేదా? ప్రశ్నార్థకంగా మారిందా అన్న అనుమానం వ్యక్తం అవుతుందన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఐతాబాద్ మండలం చందనవెల్లి లో పేద ప్రజలు సాగు చేసుకోవడానికి సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన రెండు వేల ఎకరాల భూములను పంపిణీ చేస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెజ్ పేరిట ఆ భూములను తిరిగి వెనక్కి తీసుకొని భూమిలేని పేదలుగా మార్చిందని మండిపడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ అనేక గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన లక్షల ఎకరాల భూమిని బిఆర్ఎస్ ప్రభుత్వం సెజ్ ల పేరిట సంపన్నుల కట్టబెట్టేందుకు బలవంతంగా తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.
“ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దండం పెడుతున్న . మీరు ఎవరికీ ఏం చేయాల్సిన అవసరం లేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను వాళ్లకు వదిలేస్తే అదే మీరు చేసే మేలు. ఆ భూముల పైన వాళ్లు, వాళ్ల తరాలు బతికే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి భూ సంపద ఇచ్చింది.
ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి విలువ ప్రస్తుత ఎంతో ఉందో కూడా తెలియని అమాయకులైన ప్రజలను బెదిరించి భూములు గుంజుకోకండి” అని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంపద దోపిడీ చేస్తున్న ముఖ్యమంత్రి కుటుంబమే వెలిగిపోతుందని నాలుగు కోట్ల ప్రజలు రాజ్య హింసలో నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చందనవెల్లి గ్రామంలో సెజ్ పేరిట సేకరించిన రెండువేల ఎకరాల్లో అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మకై రెవిన్యూ రికార్డులను మార్చి అవకతవకలకు పాల్పడి పరిహారం అర్హులైన వారికి మొత్తం అందకుండా సగమే ఇచ్చి మిగతా డబ్బులు టిఆర్ఎస్ నాయకులకు లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించినట్టు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విజిలెన్స్ లేదా సిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవకతవకలకు అవినీతికి పాల్పడినట్లు తేలితే అధికారులపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని కోరారు.
ఈ అవకతవకల్లో ఆనాటి జాయింట్ కలెక్టర్, ఆర్ డి ఓ, ఎమ్మార్వో స్థానిక టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నట్టు ప్రజలు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
అధికారులు చేసిన తప్పులపై రికవరీ చేయాలని ఆనాటి కలెక్టర్ ఆదేశించిన ఇప్పటివరకు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అమలు కాకుండా ఉండటం బాధాకరమన్నారు.
చందన వెళ్లి భూ నిర్వాసితుల పక్షాన సంబంధిత దర్యాప్తు సంస్థలకు సీఎల్పీ నేతగా తాను లేఖ రాస్తానని, గవర్నర్ ని కూడా కలుస్తామని, అవసరమైతే రాష్ట్రపతికి కూడా ఈ అవకతవకలపై లేఖ రాస్తానని వెల్లడించారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు భూ బకాసురులుగా మారి ప్రజల సంపదను లూటీ చేసే పాలన తెలంగాణలో అవసరం లేదన్నారు.
హైదరాబాద్ చుట్టూ వివాదాస్పదంగా ఉన్న వేల ఎకరాల భూములను ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేయడానికి ధరణి స్కిం ను స్కామ్ గా మార్చిన ధరణి రూపకర్త, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వి ఆర్ ఎస్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రభుత్వం చీఫ్ అడ్వైజర్ గా తెచ్చుకోవడం భూ కుంభకోణాల నుంచి కాపాడుకోవడం కోసమేనని స్పష్టంగా అర్థం అవుతుంది అన్నారు. సోమేశ్ కుమార్ చీఫ్ అడ్వైజర్ పదవిలో ఉంటే ధరణితో ప్రజల భూములు మాయమయ్యే ప్రమాదం ఉందన్నారు. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన పేదలకు భూమిపై హక్కు లేకుండా చేసేటువంటి కుట్రలు చేసేటువంటి సోమేష్ కుమార్ ను తక్షణమే చీఫ్ అడ్వైజర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రాణహిత ప్రాణం తీసిన కేసిఆర్ రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రాణాన్ని సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే తీసివేశారని అన్నారు. కేవలం పదివేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రాణహితను పూర్తిచేస్తే మొదటి మూడు సంవత్సరాల్లోనే 17 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేదని, కమిషన్ల కోసం రీ డిజైన్ చేసి 10 ఏండ్లు కావస్తున్న ఈ ప్రభుత్వం తెలంగాణలో ఒక ఎకరానికి కూడా సాగునీరు అదనంగా ఇవ్వలేదని వివరించారు.
రంగారెడ్డి జిల్లాకు జూరాల నుంచి నీళ్లు ఇస్తామని కొన్నాళ్లు, పాకాల నుంచి ఇస్తామని మరికొన్నాళ్లు, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లు ఇస్తామని, కుర్చి వేసుకుని అక్కడే ఉండి పనులు చేయిస్తానని చెప్పిన కేసీఆర్ పదేళ్లు కావస్తున్న కృష్ణ నుంచి రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద మొదటి పంపు నిర్మాణమే ఇంకా కాలేదన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ భూసేకరణ జరగలేదన్నారు.
ప్రజల నమ్మకాన్ని పణంగా పెట్టి పార్టీ మారి వంచన చేసిన మంత్రి సబిత
“ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఆనాడు ప్రస్తుత మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పోరాటం చేసిందని బిఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రి పదవి పొందిన తర్వాత ప్రాణహితను వదిలేయడం దురదృష్టకరమన్నారు.
టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి ప్రాణహితను వదిలారా? చేవెళ్లను వదిలారా? రంగారెడ్డి జిల్లా ప్రజల ఆకాంక్షలను వదిలేశారా? మీకు పదవి ఉంటే చాలా? ప్రజల సాగు తాగునీరు అవసరం లేదా? ప్రజల అవసరాల కోసం చాలామంది ప్రజాప్రతినిధులు మంత్రి పదవులకు రాజీనామా చేశారని, సబితా ఇంద్రారెడ్డి మాత్రం ప్రజల నమ్మకాన్ని పణంగా పెట్టి మంత్రి పదవి కోసం పార్టీ మారడం, ఓట్లు వేసిన ప్రజలను వంచన చేయడమే” అని భట్టి తీవ్రంగా మండిపడ్డారు.
10వ తరగతి పరీక్ష ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో అత్యంత స్వల్పంగా రావడం బాధ్యత కలిగిన మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కనిపించడం లేదన్నారు. ప్రాణహితను చంపేసిన ప్రభుత్వం పైన రంగారెడ్డి జిల్లా ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరిచి పాలమూరు రంగారెడ్డి నీళ్ల కోసమైనా పోరాటం చేయాలన్నారు. కృష్ణ గోదావరి నీళ్లను రంగారెడ్డి జిల్లాకు తీసుకురాకుంటే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను నీళ్ల కోసం నిలదీయాలని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఓడించినప్పుడే రంగారెడ్డి జిల్లాకు నీళ్లు వచ్చి న్యాయం జరుగుతుందని అన్నారు.