
★ రియల్ రారాజు
★ పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్
★ ఐదేండ్లలో రూ.18 వేల కోట్ల రియల్
పెట్టుబడులు
★ దేశంలోని మొదటి 5 నగరాల్లో హైదరాబాద్
★ ఆఫీస్ స్పేస్ విక్రయంలో దేశంలో నంబర్ వన్
★ ఢిల్లీ, ముంబై కూడా హైదరాబాద్ తర్వాతే
★ భవిష్యత్తు కోసం భూములు కొంటున్న సంస్థలు
★ సీబీఆర్ఈ సౌత్ ఏషియా నివేదికలో వెల్లడి
రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన పెట్టుబడులు వస్తున్న దరిమిలా హైదరాబాద్ రారాజులా నిలుస్తున్నది. మన మహానగరం.. పారిశ్రామిక పెట్టుబడులతోపాటు రియల్ పెట్టుబడులకు సైతం స్వర్గధామంగా మారింది. రియల్ బూమ్లో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే ముందంజలో ఉన్నట్టు ‘ఇండియన్ రియల్ ఎస్టేట్-బెట్టింగ్ ఆన్ ఏ క్యాపిటల్ ఫ్యూచర్’ సర్వే వెల్లడించింది.
ఒక్కో రంగంలో తనదైన ముద్ర వేసుకొంటూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరం.. పారిశ్రామిక పెట్టుబడులతోపాటు రియల్ పెట్టుబడులకు సైతం స్వర్గధామంగా మారింది. అంతర్జాతీయ కంపెనీలు నగరానికి క్యూ కడుతుండటంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఆఫీస్ స్పేస్కు కూడా భారీ ఎత్తున డిమాండు ఏర్పడటంతో రియల్ బూమ్లో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ ముందంజలోకి దూసుకెళ్లింది. ఇది ఏదో అల్లాటప్పాగా చెప్తున్న మాట కాదు. ప్రముఖ రేటింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏషియా ప్రైవేటు లిమిటెడ్ ‘ఇండియన్ రియల్ ఎస్టేట్-బెట్టింగ్ ఆన్ ఏ క్యాపిటల్ ఫ్యూచర్’ పేరిట చేపట్టిన సర్వేలో నిగ్గుతేల్చిన సత్యమిది. నివాసాలకైనా, వాణిజ్య కట్టడాల విషయంలో అయినా రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ అత్యంత అనుకూల ప్రదేశంగా మారిందని ఈ సర్వేలో తేలింది.
రూ.18 వేల కోట్ల పెట్టుబడులు
జాతీయ,అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఆశాజనకంగా తయారైంది. రియల్ ఎస్టేట్ రంగంలో గత ఐదేండ్లలో భారీగా పెట్టుబడులు వచ్చిన మెట్రో నగరాల్లో హైదరాబాద్ మొదటి ఐదు నగరాల్లో స్థానం సంపాదించింది. 2018- 2022 మధ్య కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 2.24 బిలియన్ యూఎస్ డాలర్లు (సుమారు రూ.18 వేల కోట్లు) ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది దేశంలోని రియల్ పెట్టుబడుల్లో 7 శాతం. నగరంలో కేవలం 24 భూ ఒప్పందాల ద్వారానే 970 ఎకరాల భూమిని పలు కంపెనీలు స్వాధీనం చేసుకోగా, వీటి విలువ సుమారు రూ.8,136 కోట్లు ఉంటుందని సీబీఆర్ఈ నివేదికలో పేర్కొన్నారు. 2018 నుంచి సేకరించిన మొత్తం భూమిలో 14 శాతంకంటే ఎకువ వాటాతో దేశంలో రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. 2018- 2022 మధ్య కాలంలో దేశంలో సుమారు రూ.3.56 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందులో అంతర్జాతీయ పెట్టుబడుల వాటా (క్రాస్ రీజినల్ ఇన్వెస్టర్లు) దాదాపు 47 శాతం. దేశీయ పెట్టుబడిదారుల (రియల్ ఎస్టేట్ డెవలపర్స్) వాటా 42 శాతంగా నమోదైంది. ముఖ్యంగా అంతర్జాతీయ పెట్టుబడుల్లో అధికంగా ఉత్తర అమెరికా నుంచి వచ్చినట్టు నివేదికలో తెలిపారు. రాబోయే రెండేండ్లలో మరో 16 నుంచి 17 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చే అవకాశం ఉన్నదని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమాన్ మ్యాగజైన్ తెలిపారు.
ఆఫీస్ స్పేస్లో రారాజు
రియల్ ఎస్టేట్ రంగంలో విస్తృతమైన పెట్టుబడులు వస్తున్న దరిమిలా హైదరాబాద్ ఆఫీస్ స్పేస్లో రారాజులా నిలుస్తున్నది. 2021-22 అన్రాక్ నివేదిక ప్రకారం దేశంలోని ఏడు మెట్రో నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 2021-22లో 3.42 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ విక్రయం, లీజుతో ముంబై, చెన్నై, కోల్కతా, పుణె, బెంగళూరు, ఢిల్లీ నగరాలను వెనక్కు నెట్టింది. అంతర్జాతీయస్థాయి కంపెనీలు ఇక్కడ రెండో క్యాంపస్లను ఏర్పాటు చేయడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ముందుగానే భూములను కొనుగోలు చేస్తుండటం ఎక్కువగా కనిపిస్తున్నది. అందుకే తాజా నివేదికలో భూ సేకరణలో దేశంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది