
హైదరాబాద్ నవీన్ ఘటన మరువకముందే మరో దారుణం..ప్రియురాలి కోసం స్నేహితుడి హత్య
నిజామాబాద్ హైదరాబాద్లో ప్రియురాలి కోసం నవీన్ అనే స్నేహితుడుని పొట్టన పెట్టుకున్నాడు హరి హర కృష్ణ. ఈ ఘటన మర్చిపోక ముందే నిజామాబాద్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది.
ప్రియురాలితో మాట్లాడుతున్నాడని స్నేహితుడుని హత్య చేయగా… ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో జరిగింది. ఆంధ్రానగర్ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో సంచార కుటంబాలు ఉంటున్నాయి. ఆ కాలనీలో నివసిస్తున్న చిన్న వెంకట రమణ కుమారుడు కార్తీక్, బాపట్ల రాజు స్నేహితులు. కార్తీక్కు తండ్రి చనిపోవడంతో తల్లి, కుమారులు ఉంటున్నారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతితో ఇద్దరు ప్రేమలో పడ్డారు. రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే తాను ఇష్టపడుతున్న అమ్మాయినే కార్తీక్ ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న రాజు.. అతడిపై కక్ష కట్టాడు.
దీంతో అతడిని అంతమొందించాలని పన్నాగం వేశాడు. అందుకు తమ్ముడు సహకరించాడు. వీరిద్దరూ కలిసి నందిపేట శివారులోని ఎల్లమ్మ గుడికి కార్తీక్ను పిలిచి మద్యం తాగించారు. పక్కనే ఉన్న ఓ గుట్ట దగ్గరకు తీసుకెళ్లి ఓ కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ గుట్ట వద్ద ఉన్న బండరాళ్ల మధ్య శవాన్ని వదిలేసి వెళ్లిపోయారు. అనంతరం ఆ యువతిని రాజు వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజులుగా కొడుకు కనిపించకపోవడంతో పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కి వెళ్లి ఉంటాడనుకున్నారు. పెద్ద కుమారుడి సాయంతో ఇరుగు పొరుగు ఆరా తీయగా.. ఎటువంటి సమాచారం లభించలేదు.
అయితే స్థానికులు విజయనగరం గట్టు వద్ద బండరాళ్ల మధ్య ఓ శవాన్ని గుర్తించారు. కార్తీక్ను హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని అనుమానించి తల్లికి చెప్పారు. ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్లో జరిగినట్లు తమ గ్రామంలో జరిగిందని భావించిన స్థానికులు.. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా.. బండరాళ్ల మధ్య ఓ అస్థి పంజరం కనిపించింది. జిల్లా ఆసుప్రతిలో అస్థి పంజరానికి పోస్టుమార్టం నిర్వహించగా.. అది కార్తీక్ దేనని నిర్దారణ అయింది. అయితే విచారణలో నిందితుడు రాజు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని తేలింది. నిందితులిద్దరు పరారిలో ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి.. వారి కోసం గాలిస్తున్నారు.