బీఆర్ఎస్ కు కాలం చెల్లే రోజులు వచ్చాయి

బీఆర్ఎస్ కు కాలం చెల్లే రోజులు వచ్చాయి
– మూడోసారి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు
– కేసీఆర్ మాయమాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు
– 60 ఏళ్లు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో లబ్దిపొందింది కల్వకుంట్ల కుటుంబమే
– చిరకాలం ప్రజల ఆదరాభిమానాలు నాకవ్వాలి
– ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల క్యాంపు కార్యాలయాల ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ పొంగులేటి
అశ్వారావుపేట : ఆరవై ఏళ్లు పోరాటం చేసి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేకూరలేదని… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే ఉపయోగపడిందని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఎంతోమంది మేధావుల కృషి, నిరుద్యోగుల ఆత్మబలిదానాలు, ఎన్నో రాజకీయా పార్టీల పోరాటం, ఉద్యోగుల కష్టం ఫలితంగా తెలంగాణ సిద్ధించిందనే విషయం కల్వకుంట్ల కుటుంబం గుర్తెరగడం లేదన్నారు. మాయమాటలు, మభ్యమాటలు చెబుతూ రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. ఎవరైనా ఒకసారి, రెండుసార్లు నమ్ముతారని సీఎం కేసీఆర్ మాటలను మూడోసారి తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని, బీఆర్ఎస్ కు కాలం చెల్లే రోజులు వచ్చాయని విమర్శించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావు పేట మండలాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమాల్లో పొంగులేటి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తా…. పోడు పట్టాలు ఇప్పిస్తా…. మీ బిడ్డలకు ఉద్యోగం ఇప్పిస్తా అంటూ ఇలా ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చారని, మళ్లీ అవే మభ్యపు మాటలు చెప్పి మూడోసారి అధికారంలోకి వద్దామని చేసే ప్రయత్నాలకు తెలంగాణ ప్రజలు స్వస్తి చెబుతారని పేర్కొన్నారు. మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. సీఎం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. పదవి ఉన్నా లేకున్నా ఇంతలా తనని, తన వెంట నడిచే నాయకులను ఆదరిస్తున్న ప్రజలకు అన్నివేళలా రుణపడి ఉంటానని తెలిపారు. ఇదే రకమైన ఆదరాభిమానాలు చిరకాలం ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగానే చివరి వరకు తన రాజకీయ ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా మరోమారు పొంగులేటి స్పష్టం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయాలను అందజేశారు. శుభకార్యక్రమాలకు హాజరై పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, జారె ఆదినారాయణ తదితరులు ఉన్నారు.