*మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చంటున్న అధికారులు..*

కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్‌..*

*మూడు రోజుల గందరగోళానికి తెర..*

*మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చంటున్న అధికారులు..*

కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే వారికి పౌర సరఫరాల శాఖ *తీపికబురు* తెలిపింది. ఇప్పటివరకు దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి తెరదించింది. కొత్త దరఖాస్తులు మీ-సేవ ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకు సోమవారం సివిల్‌ సప్లయిస్‌ భవన్‌లో మీ సేవ అధికారులతో ఆ శాఖకు సంబంధించిన అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో మీ-సేవలో కొత్త దరఖాస్తులు స్వీకరించడానికి మీ-సేవ అధికారులు అంగీకారం తెలిపారు. దీంతో *దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అధికారులు పునరుద్ధరించారు.* దీని ఫలితంగా మీ-సేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం సాయంత్రం నుంచి మొదలైంది.

*3 రోజులుగా గందరగోళంలో దరఖాస్తుదారులు :* ఫిబ్రవరి 7వ తేదీన కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు మీ-సేవ వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ అందుబాటులో ఉంచాలని పౌర సరఫరాల శాఖ మీ-సేవ అధికారులకు ఓ లేఖను రాసింది. ఆ లేఖకు అనుగుణంగా అదే రోజు రాత్రి నుంచి వెబ్‌సైట్‌లో సదరు ఆప్షన్‌ను అధికారులు ఉంచారు. దీంతో ఆ ఆప్షన్‌ అందరికీ కనిపించింది. దీంతో కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే వారు ఆనందంగా మీ-సేవ కేంద్రాలకు వెళ్లి చేసుకోవచ్చని అనుకున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం మీ-సేవ కేంద్రాల వద్దకు వెళ్లి పడిగాపులు కాశారు. మీ-సేవ కేంద్రాల సిబ్బంది ఆప్షన్‌ను తీసేశారని చెప్పడంతో అప్పటివరకు కేంద్రాల వద్ద బారులు తీరిన దరఖాస్తుదారులు అయోమయానికి లోనయ్యారు. కొన్నిచోట్ల విమర్శలు సైతం వచ్చాయి. దీంతో తాజా సమావేశంలో ఈ విషయమై పౌర సరఫరాల శాఖలో లోతైన చర్చే జరిగింది. ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో మొదలై ఉండటం, కేబినెట్‌ నిర్ణయం ముందే జరగడంతో సాంకేతికంగా ఎలాంటి సమస్యలు రావన్న అభిప్రాయం ఉన్నతాధికారులు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీ-సేవ అధికారుల్ని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో *సోమవారం సాయంత్రం నుంచి దరఖాస్తుల స్వీకరణను మీ-సేవ నిర్వాహకులు ప్రారంభించారు.* దీంతో రేషన్‌ దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ అనుసరించిన తీరుతో మూడు రోజుల పాటు దరఖాస్తుదారుల అందరిలో గందరగోళం నెలకొంది.

*మళ్లీ దరఖాస్తు చేయనక్కర్లేదు :* కొత్తగా రేషన్‌కార్డుల కోసం కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. *ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని* పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.

*

Ck News Tv

Ck News Tv

Next Story