నేరాల నియంత్రణ లో దేశానికే తెలంగాణ రోల్ మోడల్: సీఎం రేవంత్

సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆకాశమే హద్దుగా కొత్త రూపాలు సంతరించుకుంటున్న సైబర్ నేరాలను అరికట్టడంలో పరిమితమైన విధానాలతో కేవలం ఒక రాష్ట్రం చేసే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వవని, రాష్ట్రాలన్నీ సమన్వయంతో దేశం ఒక యూనిట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో HICC లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి “సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ -2025” ను ముఖ్యమంత్రి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి ప్రారంభించారు.

“బాధితులకు రక్షణ కవచంగా సైబర్ భద్రత - డిజిటల్ భవిష్యత్తు” (#SHIELD2025) అన్న అంశంపై జరుగుతున్న ఈ సదస్సు నుంచి ముఖ్యమంత్రి గారు కొత్తగా రూపుదిద్దుకున్న సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (COC), సైబర్ ఫ్యూజన్ సెంటర్ (CFC) లను విర్చువల్‌గా ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ, సైబర్ నేరాలను నియంత్రించడంలో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, మారుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని, తొలి ప్రయత్నంగా అందుకు అవసరమైన ఒక వారధిని నిర్మించేందుకు చొరవ తీసుకున్నందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని ముఖ్యమంత్రి గారు అభినందించారు.

సైబర్ క్రిమినల్స్ ఇటీవలి కాలంలో దాదాపు 22 వేల కోట్ల రూపాయలను కాజేసినట్టు అంచనాలు వచ్చాయని, ప్రజల జీవన స్థితిగతులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి ప్రమాదకరమైన పరిణామాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పాటు ఫేక్‌న్యూస్, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తి సమాజానికి చేటు కలిగిస్తున్నాయని అన్నారు.

సమాజంలో కొంతమంది జరగని నేరాలు జరిగినట్టు, జరగని దాడులు జరిగినట్టు లేదా మరో కారణం చేతనైనా డీప్ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని, ఆర్థిక నేరాలతో పాటు ఇలాంటి వాటన్నింటినీ నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

“సైబర్ నేరాలను అరికట్టడానికి ఐటీ సంస్థలు, నిపుణులతో కలిసి తెలంగాణ నిబద్ధతతో పనిచేస్తోంది. ఈ నేరాలను అరికట్టడంలో 24 గంటలూ సైబర్ హెల్ప్ లైన్ 1930 పనిచేస్తుంది. ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలి. గతేడాది తెలంగాణలో కొత్తగా 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాం. ఇదే క్రమంలో సైబర్ నేరాలతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

“అకాశమే హద్దుగా ప్రతి క్షణం ఏదో ఒక సైబర్ నేరం జరుగుతుందని, సైబర్ నేరం ఎక్కడి నుంచి జరిగింది. నేరం చేసిందెవరని గుర్తించడం, వారిని పట్టుకోవడం, శిక్షించడం వంటి అనేక సవాళ్లతో పాటు అసలు నేరం జరక్కుండా నిరోధించాల్సిన బాధ్యత కూడా పోలీసులపైనే ఉంది.

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఆయా రాష్ట్రాలతో సమన్వయం సాధించడానికి దేశంలో ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్‌లా ఈ సదస్సు ద్వారా ప్రయత్నించడం అభినందనీయం. సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణ ఈ దేశానికే రోల్ మాడల్‌గా నిలబడుతుంది. ఆదర్శంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.

హోం శాఖ కార్యదర్శి రవిగుప్తా , రాష్ట్ర డీజీపీ జితేందర్ , తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ , సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీ వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ కాంక్లేవ్ లో పాల్గొన్నారు.

Ck News Tv

Ck News Tv

Next Story