రైల్వే పాసుల సంగతేమిటీ ?
రైల్వే మంత్రి సమాధానంపై ఎంపీ నామ నాగేశ్వరరావు అసంతృప్తి
రాయితీ రైల్వే పాసుల గురించి లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ నామ నాగేశ్వరరావు
న్యూఢిల్లీ, డిసెంబర్ : దేశ వ్యాప్తంగా వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు సంబంధించి నిలుపుదల చేసిన రైల్వే పాసులను సత్వరమే పునరుద్దరించి, తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయాలని నామ కోరారు. ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేసే జర్నలిస్టులకు రాయితీపై రైల్వే పాస్ సౌకర్యం ఇప్పుడు అమలు చేయబడుతుందో లేదో తెలపాలని కోరారు. ఒకవేళ రాయితీపై జర్నలిస్టులకు రైల్వే పాసులు ఇవ్వకుంటే అందుకు గల కారణాలను చెప్పాలని నామ కేంద్రాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా తక్కువ ఆదాయ పేద వారి కోసం నెలవారీ ఇజ్జత్ సీజన్ టిక్కెట్లు, పాస్ల పథకం అమలులో ఉందా? లేదా? అని కూడా నామ అడగడంతో కేంద్ర రైల్వే , సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించి సమాధానం ఇచ్చారు. భారతీయ రైల్వే ఎల్లప్పుడూ సమాజంలోని అన్ని వర్గాల వారికి సరైన సేవలందించడమే కాకుండా వారికి 2019 -2020 లో వివిధ పథకాల కింద రూ.59,837 కోట్ల సబ్సిడీని అందించిందన్నారు. రైల్వేలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి సగటున 53 శాతం రాయితీ ఇస్తున్నామని చెప్పారు.వివిధ కేటగిరీలకు చెందిన దివ్యాoగులు, రోగులు, విద్యార్థులకు రాయితీలిస్తున్నట్లు పేర్కొన్న కేంద్ర మంత్రి జర్నలిస్టుల రాయితీ రైల్వే పాసుల గురించి మాట్లాడకపోవడం పట్ల నామ నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.