ఏనుగు దాడిలో రైతు మృతి
ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలో చింతలమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో బుధవారం సాయంత్రం ఏనుగు అలజడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించింది. రైతును హతమార్చిన తర్వాత లంబాడీ హెటీ, గంగాపూర్ వైపు ఏనుగు వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చింతలమానేపల్లి అటవీ ప్రాంతం నుంచి బూరెపల్లి గ్రామ శివారులోకి వచ్చిన ఏనుగు అక్కడే ఉన్న మిర్చి తోటలోకి ప్రవేశించింది.
ఆ సమయంలో అల్లూరి శంకర్(56) అనే రైతు, అతడి భార్య అక్కడ పను ల్లో ఉన్నారు. ఏనుగును గమనించిన శంకర్ దాన్ని తరిమేందుకు ప్రయత్నించగా అతడిపై అది దాడి చేసింది. కాళ్లతో తొక్కగా తీవ్రగాయాలైన శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో భయంతో పరుగులు తీసిన భార్య గ్రామస్థులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు, అటవీశాఖ అధికారులు చేరుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
జిల్లాలో ఇటువంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ… తెలంగాణలో ఏనుగుల సంచారం లేదన్నారు.
ప్రాణహిత నదికి అవత లవైపు మహారాష్ట్రలోని గడ్చరోలి జిల్లాలో 70 నుంచి 75 ఏనుగుల మంద సంచరిస్తోందని తెలిపారు. వీటిలో ఒక మగ ఏనుగు దారి తప్పి నది దాటి ఇవతలికి వచ్చిందని వెల్లడించారు.
అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ శంకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు…