KhammamPoliticalTelangana

పోస్ట్ ఆఫీసులో భారీ కుంభకోణం..

పోస్ట్ ఆఫీసులో భారీ కుంభకోణం..

పోస్ట్ ఆఫీసులో భారీ కుంభకోణం..

ఖాతాదారులు డిపాజిట్ చేసిన పొదుపు నగదులో భారీ ఎత్తున అవకతవకలు…

వైరా మండల పరిధిలోని గొల్లపూడి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో భారీ కుంభకోణం జరిగింది. ఖాతాదారులు డిపాజిట్ చేసిన పొదుపు నగదు (ఆర్డీ)లో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఖాతాదారులు చెల్లించిన పొదుపు నగదు రూ.10 లక్షల రూపాయలకు ఓ ఉద్యోగి శఠగోపం పెట్టారు.

పోస్ట్‌మెన్ మేడూరి శ్రీనివాసరావు విధులను నిర్వహించకుండా తన స్థానంలో ప్రైవేటు వ్యక్తి వరికూటి ప్రవీణ్ కుమార్‌ను అనధికారికంగా నియమించుకుని పోస్టల్ కార్యకలాపాలను చేపడుతున్నారు. గ్రామంలోని సెంటర్‌లో తనకున్న ఎరువులు దుకాణం పక్కనే ఓ షెటర్‌లో పోస్ట్‌మెన్ ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు.

ఆ కార్యాలయం కేంద్రంగా ప్రైవేటు వ్యక్తి సుమారు సంవత్సర కాలంగా ఖాతాదారుల నుంచి రోజువారీ, నెలవారీగా వసూలు చేసిన పొదుపు సొమ్ము రూ.10 లక్షలను అప్పనంగా కాజేశాడు.

వాస్తవానకి ఖాతాదారుల నుంచి వసూలు చేసిన నగదును సదరు పోస్ట్‌మెన్ పోస్టల్ మెయిన్ బ్రాంచ్‌లో ఉన్న ఖాతాదారుల అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. అయితే, ఖాతాదారుల నుంచి ప్రైవేటు వ్యక్తి నగదు వసూలు చేసి వారి పాసు పుస్తకాల్లో నగదు వసూలు చేసినట్లుగా స్టాంప్ వేసి ఇచ్చాడు. ఖాతాదారుల్లో 30 శాతం మందికే పాస్ పుస్తకాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

మిగిలిన 70 శాతం మందికి పాస్ పుస్తకాలు మంజూరు చేయకుండానే నగదు వసూలు చేయడంతో అందరూ అవాక్కవుతున్నారు. అయితే వసూలు చేసిన నగదును మెయిన్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లో ఖాతాదారుల అకౌంట్లలో కూడా జమ చేయలేదు.

సుమారు 50 మంది ఖాతాదారుల నుంచి అలా వసూలు చేసిన రూ.10 లక్షల నగదును పోస్ట్‌మెన్ అనధికారికంగా ఉద్యోగంలో పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తి కాజేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విషయం తెలుసుకున్న పోస్టల్ జిల్లా ఉన్నతాధికారులు మధిర పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, కలకోట బ్రాంచ్ పోస్టుమెన్లను విచారణకు ఆదేశించారు. దీంతో గత మూడు రోజులుగా వారు గొల్లపూడి గ్రామంలో విచారణ చేపడుతున్నారు.

పోస్ట్‌మెన్ తాను చేయాల్సిన విధుల్లో ప్రైవేటు వ్యక్తిని నియమించడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఈ వ్యవహారం బహిర్గతం కాకుండా పోస్టుమెన్ పడరాని పాట్లు పడుతున్నారని తెలుస్తోంది.

అయితే, విచారణ అధికారులను కూడా సదరు పోస్టుమెన్ ప్రభావితం చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి పొదుపు నగదును స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button