
కేటీఆర్ అన్న నా కుటుంబాన్ని ఆదుకో.. బీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం
కాంగ్రెస్ నేత భూమి కబ్జా చేసిండు.. నాకు ఏ ఫ్లాటు లేదు.. నా బిడ్డ పెండ్లి చేయాలే.. నా కుటుంబాన్ని ఆదుకో కేటీఆర్ అన్న అంటూ లేఖ రాసి బీఆర్ఎస్ సీనియర్ నేత, తాజా మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్లో జరిగింది. తన చావుకు కాంగ్రెస్ నేతలే కారణమంటూ లేఖలో పేర్కొనడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. అంకుసాపూర్ గ్రామానికి చెందిన కర్క బోయిన కుంటయ్య కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నాడు. గతంలో దుబాయికి వెళ్లి వచ్చిన ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు.
2019లో ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అప్పట్నుంచి గ్రామ అభివృద్ధిలో తనవంతుగా కృషి చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.
ఈ క్రమంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లడంతో ఆయనకు మద్దతుగా సోమవారం నాడు కుంటయ్య హైదరాబాద్ వెళ్లాడు. ఆయనతో పాటు హైదరాబాద్కు వెళ్లిన నేతలంతా సోమవారం రాత్రిలోపే ఇంటికి చేరుకున్నారు.
కానీ కుంటయ్య మాత్రం రాత్రి దాటినా ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుంటయ్య సెల్ఫోన్ సిగ్నల్ను పోలీసులు ట్రేస్ అవుట్ చేయగా.. గ్రామ శివారులో ఉన్నట్లు లొకేషన్ తెలుసుకున్నారు.
దీంతో తెల్లవారుజామున ఆ లొకేషన్కు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడిఉన్న కుంటయ్య కనిపించాడు. గడ్డిమందు తాగనని చెప్పడంతో కుంటయ్యను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
కాగా, కుంటయ్య ఆత్మహత్యకు యత్నించాడని తెలియడంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు రాజన్న, బొల్లి రామ్మోహన్ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. కాగా కుంటయ్య రాసిన ఓ సూసైడ్ నోట్ అతని దగ్గర దొరికింది.
అందులో తన చావుకు కాంగ్రెస్ నేత గంగ కృష్ణారెడ్డినే కారణమని పేర్కొనడం గమనార్హం. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రూ.10లక్షల విలువైన ప్లాట్ను కృష్ణారెడ్డి ఆక్రమించాడని, ఇప్పుడు నా బిడ్డ పెళ్లి ఎలా చేయాలని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.
కేటీఆర్ అన్న నా కుటుంబాన్ని ఆదుకో
కేటీఆర్ అన్న నా కుటుంబాన్ని ఆదుకోండి. ఇప్పుడు నాకు ఏ ప్లాట్ లేదు.. భూమి లేదు.. నా బిడ్డ పెళ్లి చేయాలి.. నా కుటుంబాన్ని ఆదుకో అన్న అంటూ కుంటయ్య ఆ లేఖలో పేర్కొన్నాడు.
కాంగ్రెస్ నేత తన భూమి కబ్జా చేశాడని.. ఇంకా తనకు ఏమీ మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కబ్జాపై ఎస్సై, సీఐకి ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు.. వారిపై నువ్వే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్న అంటూ వాపోయాడు.
ఆ లేఖను చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యాడు..కాగా, కుంటయ్య దయనీయ పరిస్థితిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని.. కుటుంబానికి అండగా ఉంటామని బీఆర్ఎస్ జిల్లా నేతలు హామీ ఇచ్చారు.