
యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకల్లో స్వల్ప తోపులాట జరిగింది.ఈ నేపథ్యంలో యోగా దినోత్సవం వేడుకల సందర్భంగా.. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గేట్ నెంబర్ 2 వద్ద బ్రేక్ ఫాస్ట్ పంపిణీ చేశారు. దీంతో కార్యక్రమానికి హాజరైన వారంతా ఒక్కసారిగా.. అక్కడికి పోటెత్తగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యువతి స్మృహ కోల్పోగా.. ఆమెను వెంటనే కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు గచ్చిబౌలి పోలీసులు.
కాగా హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో యోగా డే ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా చాలా అవసరం అన్నారు సాధకులు. ఈ రోజు నుంచే యోగాను అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. యోగాతో మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతామంటున్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద యోగా డే వేడుకలను నిర్వహించారు.
ఈ ఘటనపై స్థానిక అధికారులు స్పందించారు. జనసంచారం ఎక్కువ కావడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఈ ఘటనపై పోలీసు విచారణ కొనసాగుతోంది.
అసలు.. మన చుట్టూ ఏం జరుగుతోంది? ఈ వరుస ఘోరాలేంటి? ఊహించని ప్రమాదాలేంటి? యోగా అంటేనే ప్రశాంతత.. అలాంటిది అక్కడ కూడా తొక్కిసలాటలు జరుగుతున్నాయి.
జీవితమంటే అంత సులువు కాదని అందరికీ తెలుసు. జీవితమంటే అర్ధాంతరంగా ముగిసిపోయేది కాదనీ తెలుసు. కానీ.. ఇప్పుడు ఎవ్వరి జీవితాలకు గ్యారంటీ లేదు. ఏ క్షణంలోనైనా.. ప్రాణం పోవచ్చు. ఊహంచని ప్రమాదం ముంచుకు రావొచ్చు. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు. ఎక్కడున్నా.. ప్రాణాలకు గ్యారంటీ లేదని నిరూపిస్తున్నాయి ఇటీవల జరుగుతున్న దుర్ఘటనలు.
ఘోరం ఏదైనా కానీ.. దూరం ఎంతున్నా గానీ.. జనం ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి. వరుస దుర్ఘటనలు.. ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తున్నాయి. ఇవన్నీ.. మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయా? వ్యవస్థాగత లోపాలు, భద్రతా వైఫల్యాల ఫలితమా?
ఇలా.. ఎన్నో ప్రశ్నలు అందరి మనసుల్లో మెదులుతున్నాయి. దీని వెనుక అంతుచిక్కని ఆ భగవంతుడి లీల దాగుందని నమ్మేవాళ్లు కొందరైతే.. మానవ తప్పిదాలే మరణ శాసనం రాస్తున్నాయనేది మరికొందరి వాదన.