
ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి…
కామారెడ్డి టౌన్: విద్యార్థులను మందలించినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి చేసి చితకబాదిన ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హనుమాన్ మందిర్ పాఠశాలలో జరిగింది.
వివరాలు ఇలా.. హనుమాన్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈనెల 21న 5వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు బయటకు వెళ్లి, కొద్దిసేపటికి తిరిగి వచ్చారు.
దీంతో వారిని ఉపాధ్యాయుడు బాలకృష్ణ మందలించాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఓ బాలిక ఈ విషయాన్ని ఆమె తండ్రి ఓ విద్యార్థి సంఘ నాయకుడు వడ్ల సాయి కృష్ణతో చెప్పింది.
దీంతో వడ్ల సాయి కృష్ణ మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకుని బాలకృష్ణపై దుర్భాషలాడుతూ చితకబాదాడు.
అనంతరం సదరు ఉపాధ్యాయుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తనపై అకారణంగా దాడి చేసిన సాయికృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయుడు బాలకృష్ణ కోరారు. తన కూతురుని ఉపాధ్యాయుడు బెదిరించాడని సాయికృష్ణ తెలిపారు. ఘటనపై ఎంఈవో ఎల్లయ్య విచారణ జరిపి డీఈవోకు తెలిపారు.